ప్రభాస్ ఫ్యాన్స్ కి బిగ్ షాక్.. 'ఆదిపురుష్' యానిమేటెడ్ ఫిల్మ్!
on Aug 3, 2022
రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తొలి మైథలాజికల్ ఫిల్మ్ 'ఆదిపురుష్'. ఇందులో ప్రభాస్ శ్రీరాముడిగా కనువిందు చేయనున్నాడు. టీ-సిరీస్ ఫిలిమ్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాకి ఓం రౌత్ దర్శకుడు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటోంది. జనవరి 12, 2023న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కానుంది. అయితే ఇప్పుడు ఈ సినిమా గురించి ఓ షాకింగ్ న్యూస్ వినిపిస్తోంది. ఇది 'కొచ్చాడియాన్' తరహా యానిమేటెడ్ మూవీ అని ప్రచారం జరుగుతోంది.
సూపర్ స్టార్ రజినీకాంత్ 2014లో 'కొచ్చాడియాన్'(తెలుగులో 'విక్రమసింహ') అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించిన సంగతి తెలిసిందే. రజినీ కూతురు సౌందర్య డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని 'మోషన్ కాప్చర్' టెక్నాలజీలో యానిమేటెడ్ ఫిల్మ్ గా రూపొందించారు. కమర్షియల్ హీరోగా తిరుగులేని ఇమేజ్ ఉన్న రజినీకాంత్ ని యానిమేటెడ్ క్యారెక్టర్ లో చూడటానికి ప్రేక్షకులు ఇష్టపడలేదు. దీంతో ఈ సినిమా భారీ పరాజయం పాలైంది. అయితే ఇప్పుడు 'ఆదిపురుష్'తో ప్రభాస్ కూడా అదే రిస్క్ చేయబోతున్నట్లు తెలుస్తోంది.
'బాహుబలి' తర్వాత ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ గా మారాడు. ప్రస్తుతం ఆయన చేస్తున్న ప్రతి ప్రాజెక్ట్ పైనా భారీ అంచనాలు ఉన్నాయి. ఇక మైథలాజికల్ ఫిల్మ్ 'ఆదిపురుష్'పై అయితే అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. రాముడిగా ప్రభాస్ లుక్ ఎలా ఉంటుందోనని ఫ్యాన్స్ ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇలాంటి సమయంలో 'ఆదిపురుష్' 'కొచ్చాడియాన్' తరహా యానిమేటెడ్ మూవీ అనే వార్త రావడం షాకింగ్ మారింది.
'ఆదిపురుష్' మొదలైనప్పటి నుంచి జరిగిన కొన్ని సంఘటలను గమనిస్తే ఇది నిజంగానే యానిమేటెడ్ మూవీ అనే భావన కలుగుతోంది. జనవరి 19, 2021న ఇన్ స్టాగ్రామ్ లో ఒక ఫోటోని షేర్ చేసిన ప్రభాస్.. "మోషన్ కాప్చర్ మొదలైంది.. ఆదిపురుష్ ప్రపంచాన్ని సృష్టిస్తున్నాం" అని పోస్ట్ చేశాడు. అయితే అప్పుడు 'మోషన్ కాప్చర్' అనే పదాన్ని పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు కాని, ఇప్పుడు గమనిస్తే ఆ 'మోషన్ కాప్చర్' అనే పదం కొత్త అనుమానాలను కలిగిస్తోంది.
అలాగే 'ఆదిపురుష్' లాంటి భారీ సినిమాలు, అందునా మైథలాజికల్ ఫిల్మ్ ల షూటింగ్ కి చాలా సమయం పడుతుంది. కానీ 'ఆదిపురుష్' మాత్రం మూడు నెలల్లోనే మొత్తం షూటింగ్ పూర్తి చేసుకుంది. షూట్ పూర్తయిందని మూవీ టీమ్ ప్రకటించినప్పుడు 'అసలు ఎప్పుడు స్టార్ట్ అయింది!.. ఎప్పుడు అయిపోయింది!' అంటూ అందరూ ఆశ్చర్యపోయారు. అంత తక్కువ సమయంలో షూటింగ్ పూర్తి చేయడం కూడా ఇది యానిమేటెడ్ ఫిల్మ్ అనే అనుమానాన్ని బలపరుస్తోంది.
ఇక ఈ సినిమా షూటింగ్ పూర్తయి 8 నెలలు దాటినా కూడా ఇంతవరకు ఫస్ట్ లుక్ కూడా విడుదల చేయకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. 'ఆదిపురుష్' ఫస్ట్ లుక్ విడుదల చేయాలని ప్రభాస్ ఫ్యాన్స్ ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు. అయితే మూవీ టీమ్ నుంచి సరైన రెస్పాన్స్ లేకపోవడంతో వారు నిరాశచెందారు. అసలు 'ఆదిపురుష్' ఫస్ట్ లుక్ విషయంలో ఇంత ఆలస్యం ఎందుకు చేస్తున్నారన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న. యానిమేటెడ్ సినిమా కావడంతోనే ఫస్ట్ లుక్ ఆలస్యం చేస్తున్నారా అని ఇప్పుడు సందేహం కలుగుతోంది. ఒకవేళ 'ఆదిపురుష్' నిజంగానే యానిమేటెడ్ సినిమా అయితే ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ డిజప్పాయింట్ అయ్యే అవకాశముంది. మరి ఇది యానిమేటెడ్ సినిమానో కాదో మూవీ టీమ్ వీలైనంత త్వరగా క్లారిటీ ఇస్తుందేమో చూడాలి.