'సీతారామం' సినిమా కథ ఇదే!
on Jul 4, 2022
దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ జంటగా హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమా 'సీతారామం'. స్వప్న సినిమా బ్యానర్ పై అశ్వినీదత్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో రష్మిక కీలక పాత్రలో నటిస్తోంది. ఈ సినిమా నుంచి తాజాగా సెకండ్ లిరికల్ ను విడుదల చేశారు.
సోమవారం హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్స్ జరిగిన ఈవెంట్ లో 'ఇంతందం' సాంగ్ ను రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో హను రాఘవపూడి, మృణాల్ ఠాకూర్, మ్యూజిక్ డైరెక్టర్ విశాల్ చంద్రశేఖర్, లిరిక్ రైటర్ కృష్ణకాంత్ పాల్గొన్నారు. ఎస్పీబీ చరణ్ ఆలపించిన ఈ మెలోడీ ఆకట్టుకుంటోంది. చరణ్ గొంతు వింటుంటే ఆయన తండ్రి ఎస్పీ బాలసుబ్రమణ్యం గుర్తుకు రావడం విశేషం.
అశ్వినీదత్ గారికి మంచి మ్యూజిక్ టేస్ట్ ఉందని, సాంగ్ అద్భుతంగా రావడానికి ఆయన ప్రధాన కారణమని హను రాఘవపూడి తెలిపారు. విశాల్ చంద్రశేఖర్ తక్కువ టైమ్ లోనే అద్భుతమైన మ్యూజిక్ అందించారని అన్నారు. ఇక కృష్ణకాంత్ అందించిన లిరిక్స్ లో కొన్ని లైన్స్ వేటూరిని గుర్తు చేస్తున్నాయంటూ ప్రశంసించారు. అలాగే ఎస్పీ చరణ్ వాయిస్ లో ఇన్బిల్ట్ బాలు గారి వాయిస్ ఉందని, చాలా చక్కగా పాడారని కొనియాడారు.
ఈ సినిమా కథ ఎలా ఉండబోతుందో కూడా హను రాఘవపూడి ఈ కార్యక్రమంలో చెప్పారు. ఇది 1960-80 ప్రాంతంలో జరిగే కథ అని అన్నారు. "ఇందులో లెఫ్టినెంట్ రామ్ అనాథ. ఒకసారి కాశ్మీర్ లో ఓ ఘటన జరిగినప్పుడు రేడియో కార్యక్రమం ద్వారా ఆయన అనాథ అని అందరికీ తెలుస్తోంది. అప్పుడు అతనికి తాము ఉన్నామంటూ తల్లిగా, సోదరుడిగా, సోదరిగా ఇలా రకరకాల బంధాలతో ఉత్తరాలు వస్తాయి. కానీ ఒక లెటర్ మాత్రం భార్యగా రాసినట్లు వస్తుంది. అలా సీతా, రామ్ ల కథ మొదలవుతుంది." అని హను తెలిపారు. అలాగే సీతారాములను కలిపే కీలకమైన అఫ్రిన్ పాత్రలో రష్మిక నటించింది. ఇది చాలా బలమైన పాత్ర, రష్మికను కొత్తగా చూడబోతున్నారని హను చెప్పారు.