పెళ్లై పదేళ్ళు.. పిల్లల్ని కనేదెప్పుడు?
on Jul 4, 2022
చదువు అవ్వగానే ఉద్యోగం రాలేదా?.. ఉద్యోగం రాగానే పెళ్లి కాలేదా?.. పెళ్లి అవ్వగానే పిల్లలు లేరా?.. ఇవి తరచూ వినిపించే ప్రశ్నలు. ఈ ప్రశ్నలు సామాన్యులను మాత్రమే కాదు.. సెలబ్రిటీలను సైతం వెంటాడతాయి. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన జంటకు పెళ్లై పదేళ్లయినా ఇంకా పిల్లలని కనకపోవడంపై పలువురు ప్రశ్నిస్తుంటారు. ఈ విషయాన్ని తాజాగా ఆధ్యాత్మిక గురువు సద్గురు దగ్గర ప్రస్తావించింది ఉపాసన.
"నాకు పెళ్లై పదేళ్లు అయింది. నా వైవాహిక జీవితం చాలా సంతోషంగా సాగుతోంది. నేను నా కుటుంబాన్ని, నా జీవితాన్ని ఎంతగానో ప్రేమిస్తున్నాను. కానీ జనాలు మాత్రం నా విషయంలో RRR గురించే ఎక్కువ చర్చించుకుంటున్నారు. ఫస్ట్ R.. నా రిలేషన్షిప్ గురించి, సెకండ్ R.. రీ ప్రొడ్యూస్(పిల్లలను కనే సామర్థ్యం), మూడో R.. లైఫ్లో నా రోల్.. వీటి గురించే జనాలు ఎక్కువగా చర్చించుకుంటున్నారు" అని ఉపాసన చెప్పగా.. సద్గురు ఆసక్తికరమైన సమాధానం ఇచ్చారు.
"పిల్లలను కనకుండా ఉండేవారందరికీ నేను అవార్డులు ఇస్తాను. ఈ తరం వాళ్లు పిల్లల్ని కనాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పటికే ప్రపంచ జనాభా అధికమైపోయింది. ఒకవేళ నువ్వు ఆడపులివి అయి ఉంటే మాత్రం కచ్చితంగా పిల్లల్ని కనమని చెప్పేవాడిని. ఎందుకంటే అవి అంతరించి పోతున్నాయి. కానీ మనం అంతరించడం లేదు. ఇప్పటికే మనం ఈ భూమ్మీద చాలా ఎక్కువ సంఖ్యలో ఉన్నాం" అని సద్గురు బదులిచ్చారు.
సద్గురు మాటలు విన్న ఉపాసన.. "మీరు ఇలా చెప్పారు కదా.. ఇక మీకు మా అమ్మ, అత్త గారి నుంచి ఫోన్లు వస్తాయి" అంటూ సరదాగా చమత్కరించింది. దీంతో సద్గురు కూడా "అలాంటి అమ్మలు, అత్తల నుంచి తనకు ఎన్నో ఫోన్లు వస్తుంటాయి" అని నవ్వేశారు.