తొలి తెలుగు పాన్ ఇండియా బాలల చిత్రం 'లిల్లీ'
on Oct 2, 2022

గోపురం స్టూడియోస్ పతాకంపై కె.బాబురెడ్డి, జి.సతీష్కుమార్లు నిర్మించిన చిత్రం 'లిల్లీ'. ఈ చిత్రంతో శివమ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. నేహ లీడ్రోల్లో వేదాంత్ వర్మ, ప్రణితారెడ్డి బాలనటులుగా నటించిన ఈ చిత్రంలో రాజ్వీర్ ముఖ్యప్రాతలో నటించారు. శనివారం హైదరాబాద్లో 'లిల్లీ' సినిమా ప్రమోషన్ను లాంచనంగా ప్రారంభించింది చిత్రయూనిట్. ముఖ్య అతిథిగా హాజరైన ప్రముఖ దర్శకుడు వి.వి. వినాయక్ 'లిల్లీ' సినిమా ఫస్ట్లుక్ పోస్టర్తో పాటు సినిమాలోని ఓ సాంగ్ను విడుదల చేశారు.
ఈ సందర్భంగా దర్శకుడు వి.వి. వినాయక్ మాట్లాడుతూ.. "దర్శకుడు శివమ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం క్యాన్సర్ పై పోరాటం మీద వుంటుంది. పోస్టర్ చాలా క్రియేటివ్ గా... యూనిక్ గా వుంది.. దర్శకుడు శివమ్ పెద్ద దర్శకుడు అవ్వాలి. క్యాన్సర్ ని ఓ డైనోసార్ తో పోలుస్తూ... పోస్టర్ డిజైన్ చేసిన విధానం నచ్చించి. ఆయనకు మంచి అవకాశాలు రావాలి. అలాగే సీనియర్ నటుడు శివ కృష్ణ సినిమా మీద ఎంతో తపన వున్న నటుడు. ఆయనతో నేను చెన్న కేశవ రెడ్డి చేసా. ఇటీవల ఈ సినిమా రీ రిలీజ్ అయినప్పుడు నాకు ఫోన్ చేసి.. సినిమా రికార్డుల గురించి అడిగి తెలుసుకున్నారు. అంత ఇష్టం ఆయనకి సినిమా అంటే. ఆయన మనవడు నటించిన ఈ సినిమా హిట్ అవ్వాలి. ఇందులో నటించిన మిగతా పిల్లలకి మంచి భవిష్యత్తు వుండాలి. చిత్రానికి పని చేసిన మ్యూజిక్ డైరక్టర్ కి మంచి పేరు రాలని కోరుకుంటున్నా" అన్నారు.

దర్శకుడు శివమ్ మాట్లాడుతూ.. "లిల్లీ చిత్రంతో పాటు లిల్లీ పాత్రలో నటించిన నేహ నా జీవితానికి టర్నింగ్పాయింట్. 32ఏళ్ల క్రితం మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన 'అంజలి' సినిమానే ఈ చిత్రానికి ఇన్స్పిరేషన్. 'లిల్లీ' చిత్రాన్ని తెరకెక్కించిన తర్వాత ఆ చిత్ర దర్శకుడు మణి సార్కి ఏకలవ్య శిష్యుణ్ని నేను అని గర్వంగా చెప్పుకుంటున్నా. ఈ రోజుల్లో ఒక బాలల చిత్రాన్ని దేశవ్యాప్తంగా విడుదల చేసే అంత గొప్ప అవకాశాన్ని ఇచ్చిన నిర్మాతలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నా" అన్నారు.
నిర్మాత బాబురెడ్డి మాట్లాడుతూ.. "దర్శకుడు శివమ్ కి నేను మొదట చెప్పింది... సినిమాలో మందు, సిగరెట్, ఎటువంటి వల్గారిటీ లేకుండా వుంటే సినిమా చేస్తా అని చెప్పాను, అలాంటి కథనే చెప్పి నన్ను ఒప్పించాడు. అందుకే ఈ సినిమా తీశా. పిల్లల్ని దేవుళ్లంటారు కదా! 'లిల్లీ' సినిమా చూస్తే అలా ఎందుకంటారో అర్ధమవుతుంది. ప్రస్తుత సమాజంలో పిల్లల్ని సినిమాలకు తీసుకెళ్లాలంటే పేరెంట్స్ భయపడుతున్నారు. కానీ, మా సినిమాకి పెద్దవాళ్లే సినిమా చూడమని పిల్లల్ని పంపుతారు" అన్నారు.
నిర్మాత సతీశ్ మాట్లాడుతూ.. "పిల్లలంటేనే ఎమోషన్. కూతురున్న ప్రతి తల్లితండ్రులు లిల్లీ లాంటి బంగారుతల్లి మా ఇంట్లోకూడా ఉంటే బావుండు అనుకుంటారు" అన్నారు.
ప్రముఖ నటుడు శివకృష్ణ మాట్లాడుతూ.. "ఇలాంటి మంచి సినిమాలు ఎప్పుడో ఓ సారి మాత్రమే మన తలుపు తట్టుకుని మన దగ్గరికి వస్తాయి. ఈ చిత్రంలో నటించిన నేహ, దివ్యతో పాటు నా మనవడు వేదాంత్ వర్మకూడా ఎంతో చక్కగా నటించారు. ఈ ముగ్గురు 'లిల్లీ' వంటి మంచి చిత్రంతో నటులుగా పరిచయం అయినందుకు ఆనందంగా ఉంది" అన్నారు.
ఈ కార్యక్రమంలో మలయాళం హీరో రాజీవ్పిళ్లై, బాలీవుడ్ నటి మిషెల్ షాలు పాల్గొన్నారు. ఈ చిత్రానికి ఆంటో ఫ్రాన్సిస్ సంగీతం అందిస్తుండగా.. సినిమాటోగ్రాఫర్ గా యస్. రాజ్కుమార్, ఎడిటర్ గా లోకేశ్ కడలి వ్యవహరిస్తున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



