'కార్తికేయ-2'ని ఎవడైనా తొక్కుతాడా?.. మినిమం కామన్ సెన్స్ ఉండాలి!
on Aug 16, 2022
నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా చందూ మొండేటి దర్శకత్వంలో రూపొందిన 'కార్తికేయ-2' ఆగస్టు 13న విడుదలై మూడు రోజుల్లోనే రూ.15 కోట్లకు పైగా షేర్ రాబట్టి బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతోంది. ఈ చిత్రాన్ని చూడటానికి ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తుండటంతో.. రోజురోజుకి స్క్రీన్స్ పెరుగుతున్నాయి. అయితే ఈ సినిమా విడుదలకు ముందు ఎన్నోసార్లు వాయిదా పడింది. పైగా విడుదల రోజు తగినన్ని స్క్రీన్స్ కూడా ఇవ్వలేదన్న అభిప్రాయముంది. కొందరు కావాలనే ఈ సినిమాని తొక్కేస్తున్నారని.. ముఖ్యంగా దిల్ రాజు కారణంగా ఈ సినిమా విడుదల తేదీ మారిందని, థియేటర్స్ కూడా ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నాడని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో దిల్ రాజు చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
తాజాగా హైదరాబాద్ లో జరిగిన 'కార్తికేయ-2' సక్సెస్ మీట్ లో దిల్ రాజు పాల్గొన్నాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. "వేరే సినిమాని తొక్కాలి అని ఇండస్ట్రీ లో ఉండే మేము అసలు అనుకోము. అది న్యూస్ రాసే వాళ్ళకి, వినేవాళ్ళకి, చూసే వాళ్ళకి ఉండాల్సిన మినిమం కామన్ సెన్స్" అని అన్నాడు. తనకు సినిమా అంటే ప్రాణమని.. తాను ఎప్పటికీ, ఏ సినిమాకి హాని చేయనని.. మంచి సినిమాకి ఎప్పటికీ అండగా ఉంటానని చెప్పాడు. ప్రొడ్యూసర్స్ మధ్య సత్సంబంధాలు ఉన్నాయని, విడుదల తేదీల విషయంలో మేమంతా చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపాడు. 'థాంక్యూ'ని జులై 22న విడుదల చేయాలనుకున్నప్పుడు 'కార్తికేయ-2' టీమ్ తో చర్చించామని, వాళ్ళు వాయిదా వేసుకోవడానికి ఒప్పుకున్నారని అన్నాడు. 'కార్తికేయ-2'కు అన్ని విధాలా అండగా ఉంటానని అప్పుడే చెప్పానని, ఇదంతా తెలియకుండా కొందరు తప్పుగా రాశారని ఆవేదన వ్యక్తం చేశాడు. మీ లైక్స్, సబ్ స్క్రైబర్స్ కోసం తెలిసీ తెలియకుండా రాయొద్దంటూ చురకలు వేశాడు. తామంతా ఒకటేనని, 'కార్తికేయ-2' ప్రీరిలీజ్ ఈవెంట్ కి కూడా తనని పిలిచినా జ్వరం కారణంగా రాలేకపోయానని దిల్ రాజు చెప్పుకొచ్చాడు.
"చందూ, నిఖిల్, వివేక్ అందరితో నాకు మంచి అటాచ్ మెంట్ ఉంది. 'పీపుల్ మీడియా' ఫ్యాక్టరీ అనేది టాలీవుడ్ లో టాప్ ప్రొడక్షన్ హౌసెస్ లో ఒకటి. ఆ బ్యానర్ నుంచి వచ్చిన 'కార్తికేయ-2'ని ఎవరైనా తొక్కగలరా?.. కామన్ సెన్స్ తో ఆలోచించాలి. అన్నీ తెలిసి మాట్లాడాలి. ప్రస్తుతం థియేటర్స్ లో ఇన్ని సినిమాలున్నా కార్తికేయ-2 నైజాంలో 4 కోట్ల షేర్ కలెక్ట్ చేయడం మాములు విషయం అనుకుంటున్నారా?. ఇవన్నీ తెలీకుండా వ్యూస్ కోసం దిల్ రాజు పేరు పెట్టి ఏదేదో రాయకండి. నేను బతికున్నంత కాలం సినిమాకి హాని చేయను" అని దిల్ రాజు అన్నాడు.