డీఎస్పీ వర్సెస్ తమన్.. వరుసగా మూడో సంక్రాంతి క్లాష్!
on Jan 7, 2022
ప్రస్తుతం తెలుగునాట రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్, యంగ్ మ్యూజిక్ మేస్ట్రో తమన్ హవా నడుస్తోంది. ఇద్దరి మధ్య కూడా ఆరోగ్యకరమైన పోటీనే ఉంటోంది.
ఇదిలా ఉంటే.. తెలుగువారికి ఎంతో ప్రీతిపాత్రమైన సంక్రాంతి పర్వదిన సమయంలో అటు డీఎస్పీ, ఇటు తమన్.. ఇద్దరు కూడా మంచి విజయాలే చూశారు. అంతేకాదు.. ఈ సీజన్ లో వీరిద్దరి సినిమాలు పోటీపడిన సందర్భాలు కూడా ఉన్నాయి. 2016 సంక్రాంతికి దేవి శ్రీ బాణీలు కట్టిన `నాన్నకు ప్రేమతో`, తమన్ ట్యూన్స్ అందించిన `డిక్టేటర్` రెండు వరుస రోజుల్లో విడుదల అయ్యాయి. తెలుగునాట వారికదే.. ఫస్ట్ పొంగల్ క్లాష్.
ఆపై 2020, 2021 సంవత్సరాల్లో కూడా వీరికి సంక్రాంతి క్లాషెస్ జరిగాయి. 2020 ముగ్గుల పండక్కి డీఎస్పీ స్కోర్ చేసిన `సరిలేరు నీకెవ్వరు` రిలీజ్ కాగా.. తమన్ స్వరాలందించిన `అల వైకుంఠపురములో` కూడా సంక్రాంతి స్పెషల్ గానే వచ్చింది. ఇక 2021 సంక్రాంతికి దేవి శ్రీ మ్యూజిక్ తో `అల్లుడు అదుర్స్` రాగా, ఆ చిత్రానికి ఐదు రోజుల ముందు తమన్ `క్రాక్` సందడి చేసింది. కట్ చేస్తే.. 2022 పొంగల్ కి వరుసగా మూడోసారి ఈ ఇద్దరి మ్యూజికల్స్ ఎంటర్టైన్ చేయబోతున్నాయి. జనవరి 14న డీఎస్పీ `రౌడీ బాయ్స్` రిలీజ్ కానుండగా.. అదే రోజున తమన్ కంపోజ్ చేసిన `సూపర్ మచ్చి`తో పాటు నేపథ్య సంగీతమందించిన `డీజే టిల్లు` కూడా రాబోతోంది.
మరి.. వరుసగా మూడో సారి సంక్రాంతికి క్లాష్ అవుతున్న డీఎస్పీ, తమన్.. ఈసారి ఎలాంటి ఫలితాలను అందుకుంటారో చూడాలి.
Also Read