తప్పులు చేశాం... మళ్లీ చేయము!
on Jul 31, 2019
స్టేట్మెంట్ ఒక్కటే... 'తప్పులు చేశాం. మళ్లీ రిపీట్ చేయం'. కానీ, చెప్పింది మాత్రం ఇద్దరు! ఒకరు తండ్రి బెల్లంకొండ సురేష్. మరొకరు ఆయన తనయుడు, కథానాయకుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్. నిన్న (మంగళవారం) రాత్రి జరిగిన 'రాక్షసుడు' ప్రీ రిలీజ్ ఈవెంట్ లో వీరిద్దరూ తప్పులు మళ్లీ చేయమని, చేయకుండా ఉంటామని చెప్పారు. 'రాక్షసుడు'కు ముందు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటించిన 'సీత', 'కవచం', 'సాక్ష్యం' పరాజయాలే. కమర్షియల్ సినిమాలు 'అల్లుడు శీను', 'జయ జానకి నాయక' తరవాత ప్రయోగాల జోలికి వెళితే ఆశించిన విజయాలు రాలేదు సరికదా... నటుడిగా చెడ్డపేరు తెచ్చుకున్నాడు. అందుకని, ఇకపై కమర్షియల్ సినిమాల్లో మాత్రమే నటించాలని నిర్ణయించుకున్నాడట. 'రాక్షసుడు' ప్రీ రిలీజ్ లో "ఇకపై ప్రేక్షకులు మెచ్చే కమర్షియల్ సినిమాల్లో సాయి శ్రీనివాస్ నటిస్తాడు" అని బెల్లంకొండ సురేష్ చెప్పారు. తెలిసో తెలియకో తప్పులు చేశామని, క్షమించాలని ప్రేక్షకులను కోరారు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కూడా ఇకపై తప్పులు చేయనని అన్నాడు. ఆగస్టు 2న 'రాక్షసుడు' విడుదల కానుంది.