ఏఎన్నార్ చివరి చిత్రం 'మనం' కాదు.. విడుదలకు సిద్ధమైన 'ప్రతిబింబాలు'!
on Nov 2, 2022

అక్కినేని నాగేశ్వరరావు చివరి చిత్రం అనగానే మనందరికీ 'మనం'(2014) గుర్తొస్తుంది. అయితే ఇప్పుడు 'ప్రతిబింబాలు' అనే మరో సినిమా ఆయన చివరి చిత్రంగా విడుదల కాబోతోంది. ఎప్పుడో నలభై ఏళ్ళ క్రితం షూటింగ్ పూర్తి చేసుకొని విడుదలకు నోచుకోని ఈ మూవీ.. ఇన్నాళ్లకు విడుదల అవుతుండటం విశేషం.
1980 ప్రాంతంలో విష్ణుప్రియ సినీ కంబైన్స్ బ్యానర్ పై కె.ఎస్.ప్రకాష్ రావు దర్శకత్వంలో నిర్మాత జాగర్లమూడి రాధాకృష్ణ 'ప్రతిబింబాలు' అనే సినిమా మొదలుపెట్టారు. ఆ తర్వాత ఏవో కారణాల వల్ల సింగీతం శ్రీనివాసరావు ఈ సినిమా దర్శకత్వ బాధ్యతలు తీసుకున్నారు. ఏఎన్నార్, జయసుధ, తులసి, గుమ్మడి, కాంతారావు వంటి అలనాటి మేటి నటీమణులు నటించిన ఈ చిత్రం 1982 లోనే పూర్తయింది. కానీ, అప్పట్లో కొన్ని కారణాల వల్ల ఈ సినిమా విడుదలకు నోచుకోలేదు. ఆ సినిమా ఒకటి తీశారన్న సంగతే ఈ తరానికి తెలియదు. అలాంటిది ఏకంగా 40 ఏళ్ళ తర్వాత ఈ చిత్రాన్ని విడుదల చేస్తుండటం ఆసక్తికరంగా మారింది.
'ప్రతిబింబాలు' చిత్రం నవంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా 250 థియేటర్స్ లో విడుదల కానుంది. సినిమా పాతదే అయినా సరికొత్త హంగులతో విడుదల చేస్తున్నామని, నేటితరం ప్రేక్షకులు మెచ్చేలా చిత్రం ఉంటుందని మూవీ టీమ్ చెబుతోంది. అయితే ఈ సినిమా విడుదలవుతున్న విషయం ప్రేక్షకుల్లోకి అంత బలంగా వెళ్ళలేదు. నాగార్జున లేదా నాగ చైతన్య వంటి వారితో ఈవెంట్ నిర్వహిస్తే ఈ సినిమాపై అక్కినేని అభిమానులు ఆసక్తి చూపే అవకాశముందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



