శోభన్ బాబు `మానవుడు - దానవుడు`కి 50 ఏళ్ళు!
on Jun 22, 2022
నట భూషణ శోభన్ బాబు కెరీర్ లో ప్రత్యేకంగా నిలిచే చిత్రాల్లో `మానవుడు - దానవుడు` ఒకటి. పి. చంద్రశేఖర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రెండు ఛాయలున్న ఓ విభిన్న పాత్రలో ఆకట్టుకున్నారు శోభన్ బాబు. పగటిపూట డాక్టర్ వేణుగా, రాత్రిపూట కిల్లర్ జగన్ గా ఈ పాత్ర సాగుతుంది. `ఊర్వశి` శారద కథానాయికగా నటించిన ఈ సినిమాలో శోభన్ బాబుకి అక్కగా కృష్ణకుమారి అభినయించారు. `రెబల్ స్టార్` కృష్ణంరాజు ఓ స్పెషల్ రోల్ లో సందడి చేయగా.. కైకాల సత్యనారాయణ, రాజ బాబు, ముక్కామల, పీజే శర్మ ఇతర ముఖ్య భూమికల్లో ఎంటర్టైన్ చేశారు.
అశ్వథ్థామ సంగీతమందించిన ఈ చిత్రంలోని ``అణువు అణువున వెలసిన దేవా`` అంటూ సాగే గీతం ఎవర్ గ్రీన్ మెలోడీ గా నిలవగా.. ``అమ్మలాంటి``, ``కంచె కాడ మంచె కాడ``, ``కొప్పు చూడు``, ``పచ్చని మన కాపురం``, ``ఎవరు వీరు`` పాటలు కూడా రంజింపజేశాయి. ఉషశ్రీ ఫిల్మ్స్ పతాకంపై పి. చిన్నపరెడ్డి నిర్మించిన `మానవుడు - దానవుడు` శతదినోత్సవం జరుపుకోవడమే కాకుండా.. హిందీలో ``ఆదా దిన్ ఆదీ రాత్`, తమిళంలో `ఎంగళ్ తంగ రాజా`, మలయాళంలో ``ఇదానెంటే వళి` పేర్లతో రీమేక్ అయింది. 1972 జూన్ 23న విడుదలై జననీరాజనాలు అందుకున్న `మానవుడు దానవుడు'.. గురువారంతో 50 వసంతాలు పూర్తి చేసుకుంటోంది.