ఐటమ్ సాంగ్కి 5 కోట్లు.. ఆ టాలీవుడ్ హీరోయిన్ ఎవరో తెలుసా?
on Dec 3, 2025
సినిమాల్లో ఐటమ్ సాంగ్స్ అనేవి ప్రేక్షకులకు రిలీఫ్నిస్తాయి. ఒకప్పుడు ఈ తరహా పాటల కోసం ప్రత్యేకంగా నటీమణులు ఉండేవారు. ఆ తర్వాతి కాలంలో వారి హవా తగ్గింది. హీరోయిన్లుగా కొనసాగుతున్న వారితోనే ఐటమ్ సాంగ్స్ కూడా చేయించే కల్చర్ పెరిగింది. అందులో భాగంగానే ఎంతో మంది టాప్ హీరోయిన్లు ఏదో ఒక సందర్భంలో ఐటమ్స్ చేస్తూ వస్తున్నారు. అలా ఐటమ్ సాంగ్స్తో పాపులర్ అయిన టాలీవుడ్ హీరోయిన్ పూజా హెగ్డే.
ఒరిజినల్గా కర్ణాటకలోని ఉడిపికి చెందిన పూజా ఫ్యామిలీ ముంబాయిలో స్థిరపడింది. ముంబైలోనే జన్మించిన పూజా.. ఓ తమిళ సినిమా ద్వారా హీరోయిన్గా పరిచయమై, ఒక లైలా కోసం చిత్రంతో టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చింది. తెలుగులోనే హీరోయిన్గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. నాలుగు సినిమాల్లో హీరోయిన్గా నటించిన తర్వాత 'రంగస్థలం' చిత్రంలో 'జిగేలు రాణీ..' పాటతో ఐటమ్ గర్ల్గా మంచి పేరు తెచ్చుకుంది. ఆ తర్వాత హీరోయిన్గా నటిస్తూనే అవకాశం చిక్కినప్పుడల్లా ఐటమ్ సాంగ్స్ చేస్తోంది.
ఈ ఏడాది రజినీకాంత్ హీరోగా నటించిన 'కూలీ' చిత్రంలో 'మోనికా..' అనే స్పెషల్ సాంగ్లో కుర్రకారుకు పిచ్చెక్కించే స్టెప్స్ వేసి మరోసారి ఐటమ్ గర్ల్గా తన సత్తా చాటింది. ప్రస్తుతం నాలుగు సినిమాల్లో హీరోయిన్గా నటిస్తున్న పూజా హెగ్డే.. మరో స్పెషల్ సాంగ్కి గ్రీన్ సిగల్ ఇచ్చినట్టు తెలుస్తోంది.
అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న భారీ సినిమాలోని స్పెషల్ సాంగ్ కోసం పూజాను ఫైనల్ చేశారని తెలుస్తోంది. ఈ సాంగ్ కోసం ఆమెకు 5 కోట్లు ఆఫర్ చేశారని సమాచారం. ఇప్పటివరకు ఒక స్పెషల్ సాంగ్ కోసం ఇంతటి ఆఫర్ ఏ హీరోయిన్కీ దక్కలేదు. దీన్ని బట్టి పూజాకి ఎంత డిమాండ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. ఒక సందర్భంలో హీరోయిన్గా వెనకబడినా నిలదొక్కుకొని అవకాశాలు అంది పుచ్చుకుంటోంది. ఒక్క ఐటమ్ సాంగ్కి 5 కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటున్న పూజా.. రానున్న రోజుల్లో మరెన్ని సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



