పదేళ్ల విరామంతో భానుమతి, కృష్ణ కలిసి నటించిన 'గడసరి అత్త సొగసరి కోడలు'కి 40 ఏళ్ళు!
on Jun 20, 2021
సూపర్ స్టార్ కృష్ణ కెరీర్ లో పలు విజయవంతమైన కుటుంబకథా చిత్రాలున్నాయి. వాటిలో 'గడసరి అత్త సొగసరి కోడలు' ఒకటి. 'వియ్యాల వారి కయ్యాలు' (1979) వంటి సక్సెస్ఫుల్ మూవీ తరువాత కట్టా సుబ్బారావు దర్శకత్వంలో కృష్ణ నటించిన సినిమా ఇది. ఇందులో 'గడసరి అత్త'గా బహుముఖ ప్రజ్ఞాశాలి భానుమతి కనిపించగా.. 'సొగసరి కోడలు'గా అతిలోక సుందరి శ్రీదేవి దర్శనమిచ్చారు. నాగభూషణం, రావుగోపాలరావు, కాంచన, హరనాథ్, పి.ఎల్. నారాయణ, రాజబాబు, రమాప్రభ, వరలక్ష్మి, మమత, జేవీ రమణమూర్తి, కాకరాల, నూతన్ ప్రసాద్ ఇతర ముఖ్య పాత్రల్లో అలరించారు.
సత్యం సంగీతమందించిన ఈ చిత్రానికి వేటూరి సుందరరామ్మూర్తి సాహిత్యమందించారు. పినిశెట్టి కథను అందించడంతో పాటు కాశీ విశ్వనాథ్ తో కలిసి సంభాషణలు సమకూర్చారు. రాధాకృష్ణ క్రియేషన్స్ పతాకంపై గోరంట్ల వీరయ్య చౌదరి, సోమిశెట్టి సుబ్బారావు సంయుక్తంగా నిర్మించిన 'గడసరి అత్త సొగసరి కోడలు' .. 1981 జూన్ 20న విడుదలై జననీరాజనాలు అందుకుంది. ముఖ్యంగా అత్తాకోడళ్ల మధ్య చిత్రీకరించిన సన్నివేశాలు మహిళా ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకున్నాయి.
'అంతా మనమంచికే'లో నటించిన పదేళ్ల అనంతరం భానుమతి, కృష్ణ కలిసి చేసిన సినిమా ఇదే. గడసరి అత్త త్రిపురసుందరి పాత్రకు భానుమతి అయితేనే న్యాయం జరుగుతుందని భావించిన దర్శకుడు కట్టా సుబ్బారావు ఆమెను అడగడం, కథ నచ్చి ఆమె అంగీకరించడం జరిగాయి. భానుమతి సినిమా అనగానే కనీసం ఆమెకు ఒక పాటన్నా ఉండటం ఆనవాయితీ. ఈ సినిమాలో ఆమెకు రెండు పాటలున్నాయి. ఆమె పాడిన "శ్రీగౌరి వాగీశ్వరి.. శ్రీకర సాకార శృంగార లహరి", "చందమామ కంచమెట్టి సన్నజాజి బువ్వపెట్టి" పాటలు అలరించాయి. నేటితో ఈ కుటుంబ కథా చిత్రం.. 40 వసంతాలను పూర్తిచేసుకుంది.