30 వసంతాల `మధురానగరిలో!
on Jun 21, 2021
శతాధిక చిత్రాల దర్శకుడు కోడి రామకృష్ణ - `భార్గవ్ ఆర్ట్ ప్రొడక్షన్స్` సంస్థ అధినేత ఎస్. గోపాల్ రెడ్డి ది బ్లాక్ బస్టర్ కాంబినేషన్. వీరిద్దరి కలయికలో వచ్చిన పలు చిత్రాలు తెలుగువారిని విశేషంగా అలరించాయి. వాటిలో కామెడీ థ్రిల్లర్ గా తెరకెక్కిన `మధురానగరిలో` ఒకటి. సిద్ధిఖ్ - లాల్ రచనాదర్శకత్వంలో రూపొందిన మలయాళ చిత్రం `ఇన్ హరిహర్ నగర్` (1990) ఆధారంగా `మధురానగరిలో`ని తీర్చిదిద్దారు దర్శకుడు కోడి రామకృష్ణ. `మధురానగరిలో` అనే కాలనీలో సరదాగా గడిపే నలుగురు కుర్రాళ్ళు.. కొత్తగా అదే కాలనీలోకి వచ్చిన మాయ అనే అమ్మాయి ఆకర్షణలో పడతారు. ఇంతకీ మాయ ఎవరు? ఆమె వెనుక కథ ఏంటి? అనేది మిగిలిన సినిమా.
నిరోషా, శ్రీకాంత్, చిన్నా, రవిశంకర్, రియాజ్ ఖాన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాలో శరత్ బాబు, సురేశ్ అతిథి పాత్రల్లో దర్శనమిచ్చారు. బాబూమోహన్, వై.విజయ, శుభ, బాలాజీ ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించారు. మాతృకకి బాణీలు అందించిన ఎస్. బాలకృష్ణన్ ఈ చిత్రానికి కూడా సంగీతమందించగా.. వెన్నెలకంటి సాహిత్యమందించారు. నాగూర్ బాబు (మనో), శ్రీకుమార్ గాత్రమందించారు. గణేశ్ పాత్రో సంభాషణలు సమకూర్చారు. 1991 జూన్ 21న విడుదలైన `మధురానగరిలో`.. నేటితో 30 వసంతాలు పూర్తిచేసుకుంది.