పాన్ - ఇండియా ట్రెండ్: రెండు భాగాల జాబితాలో `సలార్`?
on Jun 21, 2021
రెండు భాగాలుగా తెరకెక్కిన `బాహుబలి` సిరీస్.. జాతీయ స్థాయిలో ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక `బాహుబలి` తరహాలోనే రెండు భాగాలుగా తయారైన `కేజీఎఫ్` సిరీస్ లో ఫస్ట్ పార్ట్ `కేజీఎఫ్ ఛాప్టర్ 1` సెన్సేషన్ క్రియేట్ చేయగా.. `కేజీఎఫ్ ఛాప్టర్ 2` విడుదలకు సిద్ధమైంది. కట్ చేస్తే.. `బాహుబలి` సిరీస్ కథానాయకుడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ - `కేజీఎఫ్` సిరీస్ కెప్టెన్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో వస్తున్న `సలార్` కూడా అదే బాట పట్టనుందట.
ఆ వివరాల్లోకి వెళితే.. యాక్షన్ సాగాగా రూపొందుతున్న `సలార్`ని తొలుత ఒకే సినిమాగా తెరకెక్కించే దిశగానే ప్రయాణాన్ని ప్రారంభించిన ప్రశాంత్ .. ఇప్పుడు స్టోరీ స్పాన్, బడ్జెట్, బిజినెస్ వంటి కారణాలతో రెండు భాగాలుగా రిలీజ్ చేస్తే ఎలా ఉంటుందన్న ఆలోచనతో ఉన్నారట. ఇందుకు చిత్ర నిర్మాణ సంస్థ హొంబళే ఫిల్మ్స్, ప్రభాస్ కూడా ఆమోదముద్ర వేశారని టాక్. త్వరలోనే `సలార్` రెండు భాగాలపై ఫుల్ క్లారిటీ వచ్చే అవకాశముంది. శ్రుతి హాసన్ నాయికగా నటిస్తున్న `సలార్`ని 2022 ఏప్రిల్ 14న విడుదల చేయబోతున్నట్లు ఇప్పటికే మేకర్స్ అనౌన్స్ చేశారు. `రెండు భాగాలు` అనే ఆలోచనతో విడుదల తేదీ విషయంలో ఎలాంటి మార్పులు చోటుచేసుకుంటాయో చూడాలి.
అన్నట్లు.. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న `పుష్ప` కూడా తొలుత ఒక భాగంగానే మొదలై.. ఇప్పుడు రెండు భాగాలుగా రూపొందుతున్న విషయం విదితమే. మొత్తమ్మీద.. పాన్ - ఇండియా వెంచర్స్ విషయంలో రెండు భాగాల ట్రెండ్ ఊపందుకుంటోందన్నమాట.