బ్లాక్ బస్టర్ మూవీ ‘గుప్త్’కి పాతికేళ్ళు!
on Jul 4, 2022
థ్రిల్లర్ మూవీస్కి ఉండే క్రేజే వేరు. అలాంటి క్రేజ్తో రిలీజై బాక్సాఫీస్ను షేక్ చేసిన హిందీ చిత్రం ‘గుప్త్’. హిందీనాట థ్రిల్లర్ మూవీస్కి కేరాఫ్ అడ్రస్గా నిలిచిన దర్శకుడు రాజీవ్ రాయ్ రూపొందించిన ఈ సినిమాలో.. బాబీ డియోల్, మనీషా కోయిరాలా నాయకానాయికలుగా నటించారు. ‘బాజిఘర్’, ‘యే దిల్లగీ’, ‘కరణ్ అర్జున్’, ‘దిల్వాలే దుల్హనియా లేజాయేంగే’ వంటి సినిమాలతో రొమాంటిక్ హీరోయిన్గా మంచి క్రేజ్ సంపాదించుకున్న కాజోల్.. ‘గుప్త్’లో ప్రతినాయిక పాత్రలో దర్శనమిచ్చింది. ఓంపురి, పరేష్ రవాల్, రాజ్ బబ్బర్, ప్రేమ్ చోప్రా, శరత్ సక్సేనా, ముకేశ్ రిషి, రాజా మురద్, ప్రియా టెండూల్కర్ తదితరులు ఇందులో ఇతర ముఖ్య భూమికలు పోషించారు.
విజు షా స్వరాలు సమకూర్చిన ‘గుప్త్’కి ఆనంద్ బక్షి సాహిత్యమందించారు . ఇందులోని “మేరే క్వాబోమే తూ”, “దునియా హసీనోంకా మేలా”, “గుప్త్ గుప్త్” (టైటిల్ సాంగ్), “బేచైనియా”, “మేరే సనమ్ ముజ్కో”, “యే ప్యార్ క్యాహై”, “యే ప్యాసీ మొహబ్బత్” వంటి పాటలు ప్రేక్షకులను ఉర్రూతలూగించాయి. ఫిల్మ్ఫేర్ చరిత్రలో బెస్ట్ విలన్గా అవార్డు అందుకున్న తొలి నటీమణిగా కాజోల్ రికార్డులకెక్కగా.. బెస్ట్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ (విజు షా), బెస్ట్ ఎడిటింగ్ (రాజీవ్ రాయ్) విభాగాల్లోనూ ఈ చిత్రానికి ఫిల్మ్ ఫేర్ పురస్కారాలు దక్కాయి. త్రిమూర్తి ఫిల్మ్స్ పతాకంపై గుల్షన్ రాయ్, రాజీవ్ రాయ్ సంయుక్తంగా నిర్మించిన ‘గుప్త్’ 1997 జూలై 4న విడుదలై అఖండ విజయం సాధించింది. కాగా, నేటితో ఈ బ్లాక్ బస్టర్ మూవీ 25 వసంతాలను పూర్తి చేసుకుంది.
Also Read