21 వసంతాల `శ్రీ మంజునాథ`!
on Jun 22, 2022
తెలుగునాట ఆధ్యాత్మిక చిత్రాలకు చిరునామాగా నిలిచిన నిర్దేశకుల్లో దర్శకేంద్రుడు కె. రాఘవేంద్ర రావు ఒకరు. `అన్నమయ్య` (1997) వంటి విజయవంతమైన సినిమా తరువాత కె. రాఘవేంద్రరావు తెరకెక్కించిన `శ్రీ మంజునాథ` (2001) కూడా ఈ తరహా చిత్రమే. `పార్వతీ పరమేశ్వరులు` (1981), `ఆపద్బాంధవుడు` (1992) వంటి సాంఘీక చిత్రాల్లో శివుడి వేషంలో ఆకట్టుకున్న మెగాస్టార్ చిరంజీవి.. ఇందులో మహాశివుడిగా పూర్తిస్థాయి పాత్రలో దర్శనమిచ్చారు. శివభక్తుడు మంజునాథుడి చుట్టూ తిరిగే ఈ సినిమాలో యాక్షన్ కింగ్ అర్జున్ ఆ ప్రధాన పాత్రలో కనిపించారు. పార్వతీదేవిగా మీనా, గంగ పాత్రలో యమున నటించిన ఈ చిత్రంలో అర్జున్ కి జోడీగా సౌందర్య అలరించగా.. అంబరీశ్, సుమలత, ఆనంద్, సుధారాణి, ఆనంద్ వర్థన్ ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించారు. జేకే భారవి ఈ సినిమాకి కథ, మాటలు అందించారు.
కథ విషయానికి వస్తే.. కర్ణాటకలో శివుడిని శ్రీమంజునాథునిగా ఆరాధిస్తూ ఉంటారు. ఆయన మహిమతో పుట్టి.. నాస్తికుడు నుంచి ఆస్తికుడుగా మారిన మంజునాథ అనే భక్తుని కథతో `శ్రీ మంజునాథ` రూపొందింది. తెలుగు, కన్నడ భాషల్లో బైలింగ్వల్ మూవీగా రూపొందిన `శ్రీ మంజునాథ`కి హంసలేఖ కట్టిన బాణీలు ప్రధాన బలంగా నిలిచాయి. మరీముఖ్యంగా.. శ్రీ వేదవ్యాస రచనలో శంకర్ మహదేవన్ గానం చేసిన `ఓం మహాప్రాణ దీపం` చార్ట్ బస్టర్ గా నిలిచింది. చిన్ని ఫిల్మ్స్ పతాకంపై నారా జయ శ్రీదేవి ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన `శ్రీ మంజునాథ`.. 2001 జూన్ 22న విడుదలై జననీరాజనాలు అందుకుంది. కాగా, నేటితో ఈ చిత్రం 21 వసంతాలు పూర్తిచేసుకుంది.
Also Read