English | Telugu

అనుకు షాకిచ్చిన ఆర్య‌వ‌ర్ధ‌న్‌!

'బొమ్మ‌రిల్లు' శ్రీ‌రామ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తూ నిర్మిస్తున్న సీరియ‌ల్ 'ప్రేమ ఎంత మ‌ధురం'. గ‌త కొన్ని వారాలుగా జీ తెలుగులో ప్ర‌సారం అవుతున్న ఈ సీరియ‌ల్ క్ర‌మ క్ర‌మంగా టాప్ రేటింగ్‌ని ద‌క్కించుకుంటూ మ‌హిళా ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకుంటోంది. ఈ శ‌నివారం 251వ ఎపిసోడ్ ప్ర‌సారం కాబోతోంది. రాత్రి 9 గంట‌ల‌కు ప్ర‌సారం అవుతున్న ఈ సీరియ‌ల్ పూర్వ జ‌న్మ‌లో మిస్స‌యిన త‌న ప్రేయ‌సి కోసం ఎదురుచూసే ఓ యువ‌కుడి క‌థ‌గా రూపొందించారు.

త‌న కంపెనీలో ఉద్యోగం మానేసిన అను నందిని టెక్స్‌టైల్స్‌లో ప‌నిచేస్తూ వుంటుంది. ఆ కంపె‌నీని కొనాల‌నే నిర్ణ‌యానికి వ‌స్తాడు ఆర్య‌వ‌ర్థ‌న్‌. ఈ విష‌యం తెలిసి జెండే వ‌ద్ద‌ని వారిస్తాడు. కార‌ణం చెప్ప‌మ‌ని ఆర్య అడుగుతుండ‌గా సీన్‌లోకి మీరా ఎంట్రీ ఇస్తుంది. "ఇంట్లో వుండాల్సింది పోయి ఆఫీస్‌కి ఎందుకొచ్చావ్ మీరా?" అంటాడు ఆర్య వ‌ర్థ‌న్‌. "వ‌ర్క్ లేకుండా వుండాలంటే ఏదోలా వుంది" అంటుంది మీరా.. క‌ట్ చేస్తే త‌ను కూడా నందిని టెక్స్‌టైల్స్ గురించి అడుగుతుంది. "ఒక‌ప్పుడు మ‌న కంపె‌నీతో పోటీప‌డిన నందిని టెక్స్‌టైల్స్‌ని మ‌నం కొన‌డం అంటే మ‌న గెలుపే క‌దా" అంటుంది. పైగా "పండ‌గ‌లు వ‌స్తున్నాయి. మ‌న‌కు స్టాఫ్ కావాలి. మిష‌న‌రీ కావాలి. ఆ కంపె‌నీని కొంటే రాజ‌నందిని శారీస్ ప్రొడ‌క్ట్‌ని పెంచుకోవ‌చ్చు"అంటుంది మీరా.

దీంతో జెండే సైలెంట్ అయిపోతాడు. ఆ వెంట‌నే నందిని టెక్స్‌టైల్స్ ఎండీ మ‌ధుక‌ర్‌ని పిలిపించి డీల్ సెట్ కావ‌డం.. కంప‌నీని ఆర్య టేకోవ‌ర్ చేయ‌డం చ‌క‌చ‌కా జ‌రిగిపోతాయి. నందిని టెక్స్‌టైల్స్ విజిట్‌కి వెళ‌తాడు ఆర్య‌.. ఆక్క‌డ త‌న‌ని ఎండీ చాంబ‌ర్‌లో చూసిన అను ఎలా రియాక్ట్ అయింది? ఆ త‌రువాత ఏం జ‌రిగింది? అన్న‌ది తెలియాలంటే ఈ రోజు రాత్రి 9 గంట‌ల‌కు జీ తెలుగులో ప్ర‌సారం అయ్యే 'ప్రేమ ఎంత మ‌ధురం' చూడాల్సిందే.