English | Telugu

నేటి నుంచే రాఘ‌వేంద్రుడి సీరియ‌ల్‌.. ఎలా ఉండ‌బోతోంది?

`కార్తీక దీపం` థీమ్‌ని ఫాలో అవుతూ ద‌ర్శకేంద్రుడు కె. రాఘ‌వేంద్రరావు స‌మ‌ర్ప‌ణ‌లో రాబోతున్న స‌రికొత్త ధారావాహిక `కృష్ణ తుల‌సి`. జీ తెలుగులో ఈ నెల 22 నుంచి ఈ సీరియ‌ల్ ప్ర‌సారం కాబోతోంది. ఇందుకు సంబంధించిన ప్రోమో ఆక‌ట్టుకుంటోంది. న‌లుపు వ‌ర్ణంలో వున్న అమ్మాయి శ్యామా.. చీక‌టంటే ప‌డ‌ని అఖిల్ మ‌ధ్య సాగే క‌థ‌గా ఈ సీరియ‌ల్‌ని రూపొందించారు.

న‌లుపు రంగులో వుండే శ్యామా అడుగ‌డుగునా అవ‌మానాలు... ఈస‌డింపులు.. ఎదుర్కొంటూ వుంటుంది. అలాంటి అమ్మాయికి అత్యంత ధ‌న‌వంతుల అబ్బాయి అఖిల్‌కి జోడీ ఎలా కుదిరింది.. రెండ‌వ కోడ‌లిగా‌ మిస్ హైద‌రాబాద్‌ని ఇంటికి తెచ్చుకున్న అత్త‌గారు న‌లుపంటేనే భ‌య‌ప‌డే అఖిల్‌కి భార్య‌గా శ్యామాని అంగీక‌రిస్తుందా?.. ఈ వెలుగు నీడ‌ల ప్ర‌యాణంలో శ్యామా క‌థ ఏ తీరం చేర‌బోతోంది అన్న‌దే `కృష్ణ తుల‌సి` క‌థాగ‌మ‌నం.

ఇప్ప‌టికే ఈ సీరియ‌ల్ కోసం ప్ర‌చారం మొద‌లుపెట్టిన రాఘ‌వేంద్రుడు ముఖ్యంగా మ‌హిళా ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకునే ప‌నిలో భాగంగా గ్రామాల్లోని మ‌హిళా ప్రేక్ష‌కుల‌కు ఇంటింటికి బొట్టు బిళ్ల‌‌ల్ని పంచుతూ ప్ర‌చారం చేయిస్తున్నారు. నేటి (ఫిబ్ర‌వ‌రి 22) నుంచి జీ తెలుగులో సాయంత్రం 6:30 గంట‌ల‌కు ప్ర‌సారం అవుతున్న ఈ సీరియ‌ల్ రాఘ‌వేంద్రుడి న‌మ్మ‌కాన్ని నిజం చేస్తుందా? లేదా అన్న‌ది తెలియాలంటే కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.