English | Telugu

జబర్దస్త్‌ షో నుంచి తప్పుకోవడానికి అసలు రీజన్‌ అదే : సౌమ్యారావు

తెలుగు టి.వి. ఛానల్స్‌లో అత్యధిక ప్రేక్షకాదరణ పొందిన షో ‘జబర్దస్త్‌’. 2013లో ప్రారంభమైన ఈ షో ద్వారా ఎంతో మంది కమెడియన్స్‌ తమ టాలెంట్‌ని ప్రదర్శించి మంచి పేరుతో పాటు ఆర్థికంగా సెటిల్‌ అయినవారు ఉన్నారు. ఈ షోలో వచ్చిన పాపులారిటీతో సినిమాల్లోకి, ఇతర శాఖల్లోకి వెళ్లినవారు కూడా ఉన్నారు. ఇప్పుడు నటిగా మంచి పేరు తెచ్చుకుంటున్న అనసూయ జబర్దస్త్‌ షోకి చాలా కాలం యాంకర్‌గా పనిచేసింది. సినిమాల్లో మంచి అవకాశాలు వస్తుండడంతో ఈ షోను పక్కన పెట్టి సినిమాల్లోనే సెటిల్‌ అయిపోయింది. దాంతో ఎక్స్‌ట్రా జబర్దస్త్‌కి యాంకర్‌గా ఉన్న రష్మీగౌతమ్‌ జబర్దస్త్‌ షోని కూడా చాలా కాలం నిర్వహించింది. ఆ తర్వాత జబర్దస్త్‌ షోకి సీరియల్‌ నటి సౌమ్యారావుని తీసుకున్నారు. అనసూయ, రష్మీలకు ఉన్నంత గ్రాస్పింగ్‌ పవర్‌, ఛరిష్మా సౌమ్యకు లేకపోయినా సంవత్సరం పాటు షోలో కొనసాగింది. ఇదిలా ఉంటే.. ఆమె స్థానంలోకి సిరి హనుమంత్‌ వచ్చి చేరింది. ఏడాది కూడా కాకుండానే సౌమ్య ఈ షో ఎందుకు గుడ్‌బై చెప్పింది అనే ప్రశ్న అందరిలోనూ మెదిలింది. దీనిపై ఒక ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చింది సౌమ్య.

‘నాకు తెలుగు భాష మీద అంత పట్టు లేదు. అంతేకాదు, స్టెప్స్‌ వెయ్యడంలో కూడా ఇబ్బంది పడేదాన్ని. అందుకే డాన్స్‌ నేర్చుకోవడానికి కూడా వెళ్లాను. అసలే సన్నగా ఉన్న నేను డాన్స్‌ చేస్తూ ఉండడంతో మరింత సన్నగా మారిపోయాను. దాంతో జబర్దస్త్‌ మేనేజర్‌ ‘మీరు డాన్స్‌ చెయ్యకండి. దాన్ని ఎలాగోలా మేనేజ్‌ చెయ్యొచ్చు. మీరు ఇంకా సన్నగా అయితే బాగోదు’ అని సలహా ఇచ్చారు. అదీకాక నాకు తెలుగు సరిగా రాకపోవడంవల్ల కొన్ని స్కిట్స్‌ అర్థంకాక ఎంజాయ్‌ చెయ్యలేకపోయాను. తెలుగు రాకపోవడం, డాన్స్‌ తెలియకపోవడం.. ఈ రెండు కారణాల వల్లే జబర్దస్త్‌ షో నుంచి తప్పుకోవాల్సి వచ్చింది’ అని వివరించింది సౌమ్యారావు.