English | Telugu

‘గుంటూరు కారం’ విషయంలో ఇప్పటికీ నాకు అర్థం కాని విషయం అదే!

ఇటీవలికాలంలో సోషల్‌ మీడియా విపరీతంగా పెరిగిపోయిన విషయం తెలిసిందే. ముఖ్యంగా సినిమాలకు సంబంధించి రకరకాల అంశాలను వివిధ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా వెలుగులోకి తెస్తున్నారు. దానివల్ల ఒక్కోసారి హీరో, హీరోయిన్లతోపాటు దర్శకనిర్మాతలు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇదే విషయాన్ని ప్రముఖ నిర్మాత సూర్యదేవర నాగవంశీ ప్రస్తావించారు. విజయ్‌ దేవరకొండ హీరోగా తను నిర్మిస్తున్న ‘కింగ్‌డమ్‌’ చిత్రం జూలై 31న విడుదల కాబోతోంది. ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్స్‌లో భాగంగా మీడియాతో మాట్లాడుతూ సోషల్‌ మీడియా వల్ల తను గతంలో ఎదుర్కొన్న సమస్యల గురించి మాట్లాడారు సూర్యదేరవ నాగవంశీ.

ఆ క్రమంలోనే మహేష్‌, త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో నాగవంశీ నిర్మించిన ‘గుంటూరు కారం’ చిత్రానికి వచ్చిన ట్రోలింగ్‌పై తన బాధను వ్యక్తం చేశారు. ‘సినిమా ఇండస్ట్రీలో శుక్రవారం అనేది చాలా ముఖ్యమైంది. సినిమా పుట్టిన నాటి నుంచి ఇప్పటివరకు శుక్రవారమే ఎక్కువగా సినిమాలు రిలీజ్‌ అవుతున్నాయి. ఆ ఒక్కరోజే సినిమా వారి భవిష్యత్తు ఏమిటి అనేది తెలిసిపోతుంది. ఆరోజు మన సినిమా రిలీజ్‌ అయినా, వేరే వాళ్ళ సినిమా రిలీజ్‌ అయినా దాని నుంచి మనం కూడా ఎంతో కొంత నేర్చుకుంటాం. ఒక విధంగా శుక్రవారం అనేది ఇండస్ట్రీకి సర్‌ప్రైజ్‌ ఇచ్చే రోజు. నా కెరీర్‌లో రెండు సార్లు సర్‌ప్రైజ్‌ అయ్యాను. ఈమధ్యకాలంలో నన్ను సర్‌ప్రైజ్‌ చేసిన సినిమా లక్కీ భాస్కర్‌. ఎందుకంటే నేను ఎక్స్‌పెక్ట్‌ చేసినంత రెవిన్యూ అది చేయలేకపోయింది.

అలాగే గుంటూరు కారం కూడా నన్ను మరో విధంగా సర్‌ప్రైజ్‌ చేసింది. విడుదలైన మొదటిరోజు, రెండో రోజు సినిమాపై విపరీతమైన ట్రోలింగ్‌ జరిగింది. అలా మా సినిమాను ఎందుకు ట్రోల్‌ చేశారు అనే విషయం ఇప్పటికీ నాకు అర్థం కావడంలేదు. ఆ తర్వాత నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్‌ అయినప్పుడు ఎలాంటి ట్రోలింగ్‌ జరగలేదు. సినిమా బాగాలేదు అనే టాక్‌ ఎక్కడా వినిపించలేదు. ట్రోల్‌ చేసేంత విషయం సినిమాలో ఏం ఉందో తెలియలేదు. ఈ రెండు సంవత్సరాల్లో గుంటూరు కారం, లక్కీ భాస్కర్‌ చిత్రాలు నన్ను సర్‌ప్రైజ్‌ చేశాయి’ అంటూ తనను సర్‌ప్రైజ్‌ చేసిన రెండు సినిమాల గురించి చెప్పుకొచ్చారు నిర్మాత నాగవంశీ.