English | Telugu

ఫిబ్రవరి 14న మృణాల్‌తో ధనుష్‌ పెళ్లి.. క్లారిటీ వచ్చేసింది!

సినిమా ఇండస్ట్రీలో రిలేషన్స్‌, పెళ్లిళ్లు, విడాకులు.. ఇవన్నీ సర్వసాధారణమైన విషయాలు. సెలబ్రిటీల వ్యక్తిగత విషయాల పట్ల ప్రేక్షకులకు ఎంతో ఆసక్తి ఉంటుంది. వారు ఎప్పుడు ఎక్కడికి వెళుతున్నారు, ఎవరిని కలుస్తున్నారు, ఎవర్ని ఎక్కువగా కలుస్తున్నారు అనే దాన్ని బట్టి వారి మధ్య ఏదో రిలేషన్‌ ఉందని, త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు బయటికి వచ్చేస్తాయి. ఇప్పుడు సోషల్‌ మీడియా అనేది ఎంతో స్ట్రాంగ్‌గా ఉండడంతో ఆ వార్త క్షణాల్లో వైరల్‌గా మారిపోతుంది.

గత కొంతకాలంగా అలాంటి ఓ వార్త సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. తమిళ స్టార్‌ హీరో ధనుష్‌, హీరోయిన్‌ మృణాల్‌ ఠాకూర్‌ పెళ్లి చేసుకోబోతున్నారనేదే ఆ వార్త. గతంలో కొన్ని బాలీవుడ్‌ పార్టీల్లో ధనుష్‌ పాల్గొన్నాడు. అక్కడికి మృణాల్‌ కూడా వచ్చింది. అలా ఇద్దరూ పలు మార్లు కనిపించడంతో వినిపిస్తున్న వార్తలకు బలం చేకూరింది. తాజాగా వినిపిస్తున్న మాట మాత్రం ఫిబ్రవరి 14న వాలెంటైన్స్‌ డే సందర్భంగా ఇద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని.

ఇలాంటి వార్త ఒక హీరో, ఒక హీరోయిన్‌ మధ్య వచ్చినపుడు సహజంగానే వాటిని ఖండిస్తారు. మరికొందరు ఆ రూమరన్సని పట్టించుకోకుండా తమ పని తాము చేసుకుంటూ వెళ్లిపోతారు. ఆ వార్తలను ఖండించిన‌ వారే ఆ తర్వాత పెళ్లి చేసుకున్న వారు కూడా ఉన్నారు. అయితే ఎప్పటిలాగే ఇప్పుడు సర్క్యులేట్‌ అవుతున్న రూమర్‌పై మృణాల్‌ ఠాకూర్‌ టీమ్‌ క్లారిటీ ఇచ్చింది.

ఫిబ్రవరిలో మృణాల్‌ పెళ్లి చేసుకోబోతోందని వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని, ప్రస్తుతం తను చేస్తున్న సినిమాలపై ఆమె దృష్టి ఉందని మృణాల్‌ టీమ్‌ తెలిపింది. ఫిబ్రవరి 20 మృణాల్‌ నటిస్తున్న ‘దో దివానే సెహెర్‌ మే’ రిలీజ్‌ కాబోతోందని, ‘డెకాయిట్‌’ షూటింగ్‌లో బిజీ కాబోతోందని తెలియజేశారు. హీరోయిన్‌గా ఎంతో బిజీగా ఉన్న మృణాల్‌ పెళ్లి చేసుకోబోతోందని వస్తున్న వార్తలు కేవలం రూమర్లు మాత్రమేనని స్పష్టం చేసింది పిఆర్‌ టీమ్‌.