English | Telugu

అల్లు అర్జున్‌కు మధ్యంతర బెయిల్‌ ఎలా వచ్చిందో తెలుసా?

అల్లు అర్జున్‌కు మధ్యంతర బెయిల్‌ ఎలా వచ్చిందో తెలుసా?

శుక్రవారం ఉదయం నుంచి అల్లు అర్జున్‌ విషయంలో జరిగిన పరిణామాలు అందరికీ తెలిసిందే. ఉదయం అల్లు అర్జున్‌ నివాసంలో అతన్ని అదుపులోకి తీసుకొని చిక్కడపల్లి పోలీస్‌ స్టేషన్‌కి తీసుకురావడం, ఆ తర్వాత వైద్య పరీక్షల నిమిత్తం గాంధీ హాస్పిటల్‌కి తరలించడం జరిగింది. అనంతరం నాంపల్లి కోర్టు ముందు అతన్ని హాజరు పరిచారు. పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌, అల్లు అర్జున్‌ తరఫు న్యాయవాది వాదనలు విన్న నాంపల్లి కోర్టు అతనికి 14 రోజుల రిమాండ్‌ విధించింది. అల్లు అర్జున్‌ని చంచల్‌ గూడ జైలుకి తరలించాలని ఆదేశాలు జారీ చేసింది. 

ఇదిలా ఉంటే... తనపై పెట్టిన కేసును కొట్టివేయాలంటూ అల్లు అర్జున్‌ హైకోర్టులో క్వాష్‌ పిటిషన్‌ వేశారు. నాంపల్లి కోర్టు తీర్పు అనంతరం అతన్ని చంచల్‌గూడ జైలుకు తరలించారు. ఈలోగా హైకోర్టులో క్వాష్‌ పిటిషన్‌పై విచారణ జరిగింది. పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌, అల్లు అర్జున్‌ తరఫు లాయర్‌ మధ్య వాడి వేడిగా వాదనలు జరిగాయి. తన క్లయింట్‌ మధ్యంతర బెయిల్‌ ఇవ్వాల్సిందిగా డిఫెన్స్‌ లాయర్‌ కోరగా, రిమాండ్‌ విధించిన వ్యక్తికి బెయిల్‌ ఎలా ఇస్తారంటూ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ ప్రశ్నించారు. దీనిపై స్పందించిన డిఫెన్స్‌ లాయర్‌ గతంలో కోర్టు వరకు వచ్చిన ఇలాంటి కేసుల గురించి ప్రస్తావించారు. అర్ణబ్‌ గోస్వామి, మహారాష్ట్ర ప్రభుత్వ కేసులో సుప్రీమ్‌ కోర్టు తీర్పును గుర్తు చేశారు. అలాగే షారూఖ్‌ ఖాన్‌, బండి సంజయ్‌లకు సంబంధించిన కేసుల గురించి కూడా ప్రస్తావించారు. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు అల్లు అర్జున్‌కు నాలుగు వారాల మధ్యంతర బెయిల్‌ను మంజూరు చేసింది. 

అల్లు అర్జున్‌కి హై కోర్టు బెయిల్‌ మంజూరు చేస్తూ.. విచారణకు సహకరించాలని కోరింది. సాధారణ బెయిల్‌ కోసం కింది కోర్టును ఆశ్రయించాలని సూచించింది. అల్లు అర్జున్‌పై విధించిన సెక్షన్లపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది హైకోర్టు. థియేటర్‌ దగ్గర జరిగిన తొక్కిసలాటలో మహిళ మృతి చెందడం పట్ల కోర్టుకు సానుభూతి ఉందని, అయితే ఆ మృతికి అల్లు అర్జున్‌ ఒక్కడినే బాధ్యుడ్ని చేయలేమని తెలిపింది. ఈ కేసులో అల్లు అర్జున్‌పై పెట్టిన సెక్షన్లు అతనికి వర్తించవని కోర్టు స్పష్టం చేసింది. నటుడు కాబట్టి 105, 118 సెక్షన్ల కింద అల్లు అర్జున్‌కు ఆపాదించాలా అని ప్రశ్నించారు న్యాయమూర్తి. ఒక యాక్టర్‌ అయినంత మాత్రాన సామాన్య పౌరుడికి వర్తించే మినహాయింపులను నిరాకరించలేమని కోర్టు తెలిపింది.

ప్రస్తుతం చంచల్‌ గూడ జైలులో ఉన్న అల్లు అర్జున్‌ ఈరోజే విడుదలవుతారని తెలుస్తోంది. రూ.50,000 వ్యక్తిగత పూచీకత్తుపై మధ్యంతర బెయిల్‌ను మంజూరు చేశారు. ఆ మొత్తాన్ని జైల్‌ సూపరింటెండెంట్‌కి చెల్లించిన తర్వాత అల్లు అర్జున్‌ని విడుదల చేస్తారు. అయితే హైకోర్టు నుంచి బెయిల్‌కి సంబంధించిన ఆర్డర్‌ జైల్‌ సూపరింటెండెంట్‌కి పంపిస్తామని న్యాయమూర్తి తెలియజేశారు. అలాగే రిమాండ్‌ విధించిన నాంపల్లి కోర్టుకు కూడా ఈ ఆర్డర్‌ను పంపుతారు.