English | Telugu

బాలయ్య బాటలో శ్రీవిష్ణు.. ఇంత రిస్క్ అవసరమా?

ఒక హీరో నటించిన రెండు సినిమాలు ఒకేరోజు విడుదలవ్వడం అనేది అరుదుగా జరుగుతుంటుంది. గతంలో నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna), నాని(Nani) ఈ సాహసానికి ఒడిగట్టారు. ఇప్పుడు శ్రీవిష్ణు(Sree Vishnu)కి కూడా ఇలాంటి పరిస్థితి ఎదురయ్యేలా ఉంది.

1993, సెప్టెంబర్ 3న బాలకృష్ణ హీరోగా నటించిన 'బంగారు బుల్లోడు', 'నిప్పురవ్వ' సినిమాలు విడుదలయ్యాయి. 'బంగారు బుల్లోడు' విజయం సాధించగా, 'నిప్పురవ్వ' మాత్రం బాక్సాఫీస్ దగ్గర నిరాశపరిచింది.

నాని హీరోగా నటించిన 'ఎవడే సుబ్రమణ్యం', 'జెండాపై కపిరాజు' సినిమాలు మార్చి 21, 2015న ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఇందులో 'ఎవడే సుబ్రమణ్యం' మెప్పించగా, 'జెండాపై కపిరాజు' మాత్రం పరాజయం పాలైంది.

ఇక ఇప్పుడు ఈ ఫిబ్రవరి 27న శ్రీవిష్ణు నటించిన రెండు సినిమాలు విడుదలయ్యే అవకాశం కనిపిస్తోంది. 'మృత్యుంజయ్', 'విష్ణు విన్యాసం' సినిమాలతో ప్రేక్షకులను పలకరించనున్నాడు శ్రీవిష్ణు. ఫిబ్రవరి 27న 'మృత్యుంజయ్'ను విడుదల చేయనున్నట్లు ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. 'విష్ణు విన్యాసం'ను సైతం అదే తేదీకి తీసుకోవడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.

సినిమాల విడుదల తేదీలపై ఓటీటీల ప్రభావం ఉంటుందని కొంతకాలంగా చర్చ జరుగుతోంది. ఇప్పుడు శ్రీవిష్ణు సినిమాల విషయంలోనూ అదే కారణమని తెలుస్తోంది. 'మృత్యుంజయ్', 'విష్ణు విన్యాసం' సినిమాల ఓటీటీ డీల్స్ ఇప్పటికే క్లోజ్ అయ్యాయి. ఆ డీల్స్ ప్రకారమే ఒకే తేదీకి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది అంటున్నారు.

అయితే ఒకే హీరో నటించిన రెండు సినిమాలు ఒకేరోజు విడుదలైతే.. ప్రమోషన్స్ కి కష్టమవుతుంది. అలాగే రిజల్ట్ పరంగా కూడా ఒక సినిమాకి నష్టం జరిగే అవకాశముంది. ఒక సినిమా చాలా బాగుండి, మరో సినిమా జస్ట్ బాగుంది అనిపించుకుంటే.. చాలా బాగున్న సినిమా వైపే ప్రేక్షకులు మొగ్గుచూపుతారు. దాంతో రెండో సినిమాకి నష్టం జరుగుతుంది. దీనిని దృష్టిలో పెట్టుకొని.. ఓటీటీ సంస్థలతో మాట్లాడుకొని, రెండు సినిమాల మధ్య కాస్త గ్యాప్ ఉండేలా చూసుకుంటారేమో చూడాలి.

Also Read: బాలయ్య తో హరీష్ శంకర్ ఊర మాస్ మూవీ.!