English | Telugu

ఎట్టకేలకు పూరి కొత్త సినిమాకి ముహూర్తం కుదిరింది!

దర్శకుడు పూరి జగన్నాథ్ తదుపరి సినిమా ఏంటనేది కొంతకాలంగా ఆసక్తికరంగా మారింది. విజయ్ దేవరకొండతో పూరి చేసిన 'లైగర్' డిజాస్టర్ కావడంతో వారి కలయికలో తెరకెక్కాల్సిన మరో సినిమా 'జనగణమన' అటకెక్కింది. విజయ్ ఇతర సినిమాలతో బిజీ అయిపోయాడు. పూరి మాత్రం 'లైగర్' విడుదలై ఎనిమిది నెలలు దాటినా ఇంతవరకు తన తదుపరి సినిమాని ప్రకటించలేదు. చిరంజీవి, బాలకృష్ణ నుంచి ఆకాష్ పూరి వరకు.. ఈ హీరోతోనే పూరి తదుపరి సినిమా రకరకాల పేర్లు వినిపించాయి. ఇక ఇటీవల రామ్ పోతినేని పేరు ప్రముఖంగా వినిపించింది. అయితే ఎట్టకేలకు పూరి తదుపరి సినిమాపై క్లారిటీ వచ్చేసింది.

'ఇస్మార్ట్ శంకర్' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత రామ్-పూరి ద్వయం మరోసారి చేతులు కలుపుతున్నారు. రామ్ పుట్టినరోజు కానుకగా మే 15న ఈ మూవీ అధికారిక ప్రకటన రానుందని సమాచారం. రామ్ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ మాస్ ఎంటర్టైనర్ చేస్తున్నాడు. ఈ ఫిల్మ్ దసరా కానుకగా విడుదల కానుంది. దీని తర్వాత రామ్ చేయబోయే సినిమా పూరితోనే అని తెలుస్తోంది. అయితే ఇది 'ఇస్మార్ట్ శంకర్'కి సీక్వెలా? విజయ్ తో చేయాలనుకున్న 'జనగణమన'నా? లేక కొత్త కథనా? అనేది తెలియాల్సి ఉంది.

రామ్ కెరీర్ లో 'ఇస్మార్ట్ శంకర్' బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. అప్పటి నుంచే రామ్ ఎక్కువగా మాస్ సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నాడు. మరి ఈసారి పూరి, రామ్ తో ఎలాంటి సినిమా చేస్తాడో? మళ్ళీ ఆ హిట్ మ్యాజిక్ ని రిపీట్ చేస్తాడేమో చూడాలి.