English | Telugu
మనసు మార్చుకున్న యశ్ రాజ్ ఫిలిమ్స్.. తెలుగునాట వార్-2 పరిస్థితి ఏంటి..?
Updated : Jul 1, 2025
జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న బాలీవుడ్ ఫిల్మ్ 'వార్-2'. అయాన్ ముఖర్జీ డైరెక్ట్ చేస్తున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ లో హృతిక్ రోషన్ తో కలిసి ఎన్టీఆర్ స్క్రీన్ షేర్ చేసుకుంటున్నాడు. యశ్ రాజ్ ఫిలిమ్స్ స్పై యూనివర్స్ లో భాగంగా రానున్న 'వార్-2'.. ఆగస్టు 14న థియేటర్లలో అడుగుపెట్టనుంది. ఇండియన్ టాప్ స్టార్స్ ఎన్టీఆర్, హృతిక్ కలిసి నటిస్తున్న సినిమా కావడంతో 'వార్-2'పై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. ఈ మూవీ పాన్ ఇండియా వైడ్ గా సంచలనాలు సృష్టించడం ఖాయమనే అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా ఎన్టీఆర్ స్టార్డంతో తెలుగునాట భారీ వసూళ్లు రాబడుతుందని అందరూ భావిస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ బిజినెస్ కి భారీ డిమాండ్ ఏర్పడినట్లు తెలుస్తోంది.
యశ్ రాజ్ ఫిలిమ్స్ తమ సినిమాలను సొంతంగా రిలీజ్ చేసుకుంటూ ఉంటుంది. 'వార్-2'ని కూడా తెలుగు స్టేట్స్ లో ఓన్ గా రిలీజ్ చేయాలని మొదట భావించింది. అయితే ఎన్టీఆర్ నటించడంతో ఈ సినిమా రైట్స్ తీసుకోవడానికి తెలుగు నిర్మాతలు ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు. దాంతో యశ్ రాజ్ ఫిలిమ్స్ మనసు మార్చుకున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే పలువురు తెలుగు నిర్మాతలతో చర్చలు మొదలయ్యాయట. ఎన్టీఆర్ సన్నిహితుడు, ప్రముఖ నిర్మాత నాగవంశీ ఈ రేస్ లో ముందు ఉన్నట్లు తెలుస్తోంది. వార్-2 తెలుగు రాష్ట్రాల హక్కులను యశ్ రాజ్ ఫిలిమ్స్ రూ.100 కోట్లకు కోట్ చేయగా.. నాగవంశీ రూ.80 కోట్లు ఆఫర్ చేశారట. ఫైనల్ గా రూ.90 కోట్లకు డీల్ కుదిరేలా ఉందని అంటున్నారు.
డబ్బింగ్ సినిమా అయినప్పటికీ కేవలం ఎన్టీఆర్ ఉండటంతోనే 'వార్-2'కి తెలుగునాట ఇంత డిమాండ్ ఉందని చెప్పవచ్చు. ఎన్టీఆర్ గత చిత్రం 'దేవర' డివైడ్ టాక్ తోనూ.. తెలుగు స్టేట్స్ లో ఏకంగా రూ.160 కోట్లకు పైగా షేర్ రాబట్టింది. 100 కోట్ల లోపు షేర్ టార్గెట్ తో బరిలోకి దిగనున్న వార్-2.. హిట్ టాక్ వస్తే తెలుగునాట ఓ రేంజ్ ప్రాఫిట్స్ చూస్తుంది అనడంలో సందేహం లేదు.