English | Telugu

ఆంధ్ర, తెలంగాణ నిర్మాతల మధ్య రగడ


ఏపి ఫిలిం చాంబర్‌లో ఈరోజు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నిర్మాతల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఏపి చాంబర్‌లో తెలంగాణ ప్రత్యేక చాంబర్ ఏర్పాటు చేయాల్సిందే అని ఆ ప్రాంత నిర్మాతలు భీష్మించుకున్న విషయం తెలిసిందే. రాష్ట్రాలు వేరైనా మాట్లాడే భాష ఒక్కటే అయినప్పుడు వేరే ఏర్పాటు అవసరం లేదని ఆంధ్ర ప్రాంత నిర్మాతలు సూచించారు. ఈ విషయాన్ని ఏ మాత్రం సమ్మతించని తెలంగాణ సినీ సంఘ సభ్యులు చాంబర్ ‌లో దుర్భాషలాడారు. చాంబర్ కు చెందిన బూరుగులపల్లి శివరామకృష్ణ, ఎన్ వి ప్రసాద్ లను తెలంగాణ సభ్యులు తీవ్ర పదజాలంతో దూషించారని సమాచారం. ఈ వివాదంలో తెలంగాణ చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ విజయేందర్ రెడ్డి, తెలంగాణ నిర్మాతల మండలి అధ్యక్షుడు సానా యాదిరెడ్డి, అల్లాని శ్రీధర్ ప్రముఖంగా వినవస్తున్నాయి. ఈ రోజు ఏపి ఫిలిం చాంబర్‌లో చోటుచే సుకున్న సంఘటనతో తెలుగు సినీ పరిశ్రమలో మరిన్ని వివాదాలు తలెత్తే అవకాశాలు కనిపిస్తున్నాయి.