English | Telugu
ఎన్పిఆర్ వివక్షతపై నోరు విప్పని జగన్
Updated : Mar 10, 2020
మైనారిటీల ఒత్తిడికి తట్టుకోలేక ఎన్.ఆర్.సి.ని వ్యతిరేకిస్తున్నట్టు ప్రకటించిన జగన్ మోహన్ రెడ్డి మరో వైపు దానికి మూలమైన ఎన్.పి.ఆర్.ను అమలు చేయడానికి పూనుకుంటున్నారు. గెజిట్ నోటిఫికేషన్లు ఇచ్చారు. మెమోలు జారీ చేశారు. ఎన్యూమరేటర్లకు శిక్షణ పూర్తి చేశారు. ఏప్రిల్ 1 నుండి వారు మన ఇంటి ముంగిట వాలతారు. దీన్ని ఆపడానికి మాత్రం జగన్ మోహన్ రెడ్డికి చేతులు రావడం లేదు. దీన్ని ఆపకుండా ఎన్.ఆర్.సి.కి వ్యతిరేకం అని ప్రకటించినంత మాత్రాన ఒరిగేదేమీ ఉండదు.
మరో వైపు రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ అభ్యర్థన మేరకు పరిమళ్ నత్వానీకి రాష్ట్రం నుంచి రాజ్యసభకు ప్రాతినిథ్యం వహించే అవకాశాన్ని ముఖ్యమంత్రి జగన్ మోహన్రెడ్డి కల్పించారు. నాల్గవ సీటు ముస్లిం అభ్యర్థికి అదే ఎమ్మెల్సీ రిటైర్డ్ ఐజి ఇక్బాల్కు కేటాయిస్తారనే ప్రచారం జరిగింది. అయితే ముస్లింకు కేటాయించాల్సిన రాజ్యసభ స్థానంలో మోదీ, అమిత్షా సూచన మేరకు పరిమళ్ నత్వానీ వైసిపి రాజ్యసభకు పంపుతుంది.
ఆంధ్రప్రదేశ్లో ఎన్.పి.ఆర్. వ్యతిరేకిస్తూ ముస్లింలు రోడ్లపైకి వచ్చిన నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా జగన్ ప్రభుత్వానికి గానీ, ప్రతిపక్ష చంద్రబాబుకు గానీ చీమ కుట్టినట్లు కూడా లేదు. మోడీ హుకుంలకు భయపడి నోరెత్తడం లేదు. స్వార్ధ రాజకీయాల కోసం రాష్ట్రంలో ముస్లింలను, సామాన్య పౌరులను బలి చేయనున్నారు. బిజెపికి పవన్ కళ్యాణ్ గులాంగా మారాడు. రాష్ట్ర ప్రజల మదిలో మెదులుతున్న ఈ ప్రశ్నలకు పై పార్టీల నుండి జవాబు లేదు. దేశంపై మతోన్మాద నిరంకుశత్వ మేఘాలు కమ్ముకొస్తున్నా వీరికి కనిపించడం లేదు, వినిపించడం లేదు.
ఒక్కసారి ఎన్.పి.ఆర్.లో మన వ్యక్తిగత వివరాలు నమోదైన తరువాత ప్రజల చేతిలో ఏమీ ఉండదు. 73 ఏళ్ళ స్వాతంత్య్రానంతరం 'నేను ఈ దేశ పౌరుడినేనా' అని ప్రశ్నించుకునే దుస్థితిని మోడీ ప్రభుత్వం కల్పించింది. ఇంత జరుగుతున్నా జగన్బాబు, చంద్రబాబు, కళ్యాణ్బాబులకు మాత్రం ఇవి పట్టవు. ఈ విషయంలో ఎవరికి ఎవరూ తక్కువ కాదన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. పోటీలు పడి మోడీకి గొడుగు పడుతున్నారు.
విదేశీ హిందువుల మీద ఉన్న ప్రేమ స్వదేశంలో వున్న దళితులు, ఆదివాసీలు, బిసిలు, మహిళలపై లో ఒక్క శాతం కూడా లేదు. 2009 నాటికి విదేశాల నుండి వచ్చిన వారికి పౌరసత్వం ఇస్తామని చెబుతున్న మోడీ స్వదేశీ పౌరులకు ఎన్.ఆర్.సి. పేరిట 1971కి ముందు ఇక్కడున్నట్లు నిరూపించుకోవాలని చెబుతున్నారు.