English | Telugu
తెలుగుదేశానికి ఏమైంది..
Updated : Mar 12, 2020
గత సంవత్సరం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పైకాపా చేతిలో చిత్తుగా ఓడినప్పటికీ తెలుగుదేశం పార్టీ మొత్తం మీద 39శాతం ఓట్లు సాధించి తనను తక్కువగా చూడవద్దని సంకేతాలు పంపింది. కానీ గత 10 నెలలుగా అధికారపార్టీపై టీడీపీ అనుసరిస్తున్న ప్రతి వ్యూహం, అధికారపక్షంపై చేస్తున్న సమరం చివర్లో బెడిసి కొడుతుండటంతో పార్టీ భవిష్యత్తు ఏమిటన్న ప్రశ్న కింది స్థాయి కేడర్లో కూడా బలపడిపోతున్నట్టు కనపడుతోందని రాజకీయ పరిశీలకులు విశ్లేసిస్తున్నారు. ఈ బలహీన పరిణామాలు స్థానిక ఎన్నికల సమయానికి మరింతగా ముదిరి అధినేతను కలవరపెడుతున్నాయి.
స్థానిక ఎన్నికల నగారా మోగగానే తెలుగుదేశం పార్టీ తన చరిత్రలో ఎన్నడూ లేనంత సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ముఖ్యంగా కీలకమైన నేతలు నైరాశ్యంలో మునిగిపోవడం ఒక ఎత్తైతే పాతికేళ్లకు పైగా పార్టీని అంటిపెట్టుకుని ఉన్న సీనియర్ నేతలు రాజీనామా బాట పట్టడం టీడీపీ అధినేతను కలవరపరుస్తోన్న అంశం. దీనికి మించి స్థానిక బరిలో నిలిచేందుకు అభ్యర్థులు దొరక్క దిక్కులు చూడాల్సి రావడం టీడీపీ చరిత్రలోనే ఎన్నడూ చూసి ఉండలేదని అనుభవజ్ఞులే చెబుతున్నారు.
ముఖ్యంగా జేసీ, గంటా, నారాయణ వంటి అతి ముఖ్యనేతలు ఇప్పటికే చేతులెత్తేసారు. అధికార పార్టీ తమను లక్ష్యంగా చేసుకోవడం, పార్టీ భవిష్యత్తు తమ భవిష్యత్తుకు భరోసాగా ఉంటుందన్న నమ్మకం సడలిపోవడంతో వీరు పూర్తిగా ఇంటికే పరిమితమైన స్థితి కనిపిస్తోంది. ఒక రకంగా చూస్తే ఈ నేతలది స్మశాన వైరాగ్యమే. వైసీపీతో సహా ఏ ఇతర పార్టీల్లోకి ఇలాంటి వారు వెళ్లలేరు. సొంత పార్టీలో కొనసాగాలనుకున్నా దాని భవిష్యత్తు అంధకారంలా కనిపిస్తుంటే బహిరంగ జీవితంలోకి రాలేరు. ముఖ్యంగా జేసీ దివాకర్ రెడ్డి ఇప్పుడు స్మశాన వైరాగ్యానికి మారుపేరుగా నిలుస్తున్నారు. మందూ, డబ్బులు పంచితే గెలిచినా పదవి పోవడమే కాకుండా రెండేళ్లు జైలుకు పోవాల్సి ఉంటుందని ప్రభుత్వం తేల్చి చెప్పడంతో స్థానిక సంస్థల్లో ఒక్క సీటులో కూడా మా జిల్లాలో పోటీకి నిలపం అనేంతగా హడలిపోయారాయన.
అధికారంలో ఉన్నప్పుడు ఎదురులేకుండా చక్రం తిప్పిన అనంతపురం జిల్లా తాడిపత్రికి చెందిన జేసీ బ్రదర్స్ అధికారం కోల్పోయాక ఇప్పుడు ప్రతిపక్ష పాత్ర పోషించలేక చేతులెత్తేయడం రాష్ట్ర వ్యాప్తంగా ఎప్పటినుంచో చర్చనీయాంశమైంది. స్థానిక ఎన్నికల్లో తాము పోటీ చేయలేమని ప్రకటించి తన నిస్సహాయత్వాన్ని చాటుకున్న జేసీ దివాకర్రెడ్డి.. మొత్తంగా స్థానిక ఎన్నికలను బహిష్కరించాలని చంద్రబాబును కోరడం పట్ల ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. జేసీ దివాకర్రెడ్డి చేతులెత్తేయడంతో ఆయన కుమారుడు పవన్కుమార్రెడ్డితో చంద్రబాబు మాట్లాడారు. స్థానిక ఎన్నికల్లో కాడి పడేయకుండా ఎలాగోలా పోటీకి శ్రేణులను సిద్ధం చేయాలని బాబు.. పవన్ను కోరినట్లు టీడీపీ వర్గాలు చర్చించుకుంటున్నాయి.
స్థానిక బరిలో నిలిచేందుకు చాలా చోట్ల అభ్యర్థులు దొరక్కుండా చీయాలని అధికార పక్షం వేస్తున్న ఎత్తుగడలు, చేస్తున్న దాడులతో ఇబ్బందులు పడుతున్న తరుణంలో ఈ పరిణామాలు పార్టీ శ్రేణుల్ని మరింత కుంగదీస్తున్నాయి. సీనియర్ నేతలు కాడి వదిలేస్తుండటంతో చంద్రబాబు నియోజకవర్గ ఇన్చార్జిలు, మండలాల నాయకులతో టెలీకాన్ఫరెన్స్ ద్వారా, నేరుగా మాట్లాడుతున్నారు. ఎలాగైనా పోటీ చేయాలని, అభ్యర్థులు దొరక్కపోతే చురుగ్గా ఉన్న యువకులను గుర్తించి నామినేషన్లు వేయించాలని సూచిస్తున్నట్టు ఆ పార్టీకి చెందిన ఓ సీనియర్ నేత చెప్పారు. అవసరమైన చోట్ల జనసేన, సీపీఐ పార్టీలకు చెందిన వారితో మాట్లాడుకుని వారిని పోటీకి నిలబెట్టి మద్దతు ఇవ్వాలని, పోటీ లేకుండా ఏకగ్రీవాలకు ఒప్పుకోవద్దని కోరుతున్నట్లు సమాచారం.
విశాఖపట్నంలో మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు పార్టీలో ఉన్నారా లేరా అన్నట్టున్నారు. కేవలం తన నియోజకవర్గానికి మాత్రమే పరిమితమై నామమాత్రంగా పని చేస్తున్నట్లు టీడీపీ వర్గాలు వాపోతున్నాయి. అధికారంలో ఉన్నప్పుడు నెల్లూరు జిల్లాలో చక్రం తిప్పిన మాజీ మంత్రి పి.నారాయణ ప్రస్తుతం అసలు బయటకు రావడం లేదు. ఈ ఎన్నికలను ఆయన పట్టించుకోకుండా దూరంగా ఉన్నారు. టీడీపీ హయాంలో హవా నడిపిన ముఖ్య నాయకులు, మాజీ మంత్రులు ఆది నారాయణరెడ్డి, మాగంటి బాబు, శిద్ధా రాఘవరావు, పత్తిపాటి పుల్లారావు వంటి పలువురు నేతలు స్థానిక ఎన్నికలను సీరియస్గా తీసుకోవడంలేదని ఆ పార్టీలో చర్చ జరుగుతోంది.
అనేక నియోజకవర్గాల్లో ఇన్చార్జిలు కూడా చేతులెత్తేయడంతో ద్వితీయ శ్రేణి నాయకత్వం, కింది స్థాయి క్యాడర్ తీవ్ర నిరుత్సాహానికి లోనవ్వడం స్పష్టంగా కనిపిస్తోంది. జిల్లా నాయకులు, నియోజకవర్గ ఇన్చార్జిలు ఎన్నికలను పట్టించుకోకపోవడంతో ఆయా ప్రాంతాల స్థానిక నాయకులు నేరుగా టీడీపీ రాష్ట్ర నాయకులు, కార్యాలయాలకు ఫోన్లు చేసి తమ పరిస్థితి ఏమిటని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇలాంటి తరుణంలోనే ముఖ్య నాయకులు వరుసగా రాజీనామాలు చేస్తుండడం టీడీపీకి మరింత ఇబ్బందికరంగా మారిందని ఆ పార్టీ శ్రేణులు వాపోతున్నాయి. వైఎస్సార్ జిల్లా పులివెందులకు చెందిన సతీష్రెడ్డి రాజీనామా చేయడం, జమ్మలమడుగు రామసుబ్బారెడ్డి అధికార పార్టీలో చేరిపోవడం, మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి బీజేపీ తీర్ధం పుచ్చుకోవడం ఆ జిల్లాలో టీడీపీకి గట్టి ఎదురు దెబ్బగా భావిస్తున్నారు. ఎన్నో సంవత్సరాల నుంచి పులివెందులలో పార్టీ కోసం పని చేసిన నాయకుడు ఒక్కసారిగా పార్టీని వీడడంతో ఆ పార్టీ క్యాడర్ తీవ్ర నిరుత్సాహంలో మునిగిపోయింది.
ఇది చాలదన్నట్టు నందమూరి బాలకృష్ణకు అత్యంత సన్నిహితుడిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే కదిరి బాబూరావు, ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్, మాజీ ఎమ్మెల్యే రెహమాన్ వైసీపీలో చేరడంతో ఆయా ప్రాంతాల్లో టీడీపీ ఉనికి ప్రశ్నార్ధకంగా మారిందని ఆ పార్టీ నేతలే అంగీకరిస్తున్నారు. మరికొందరు ముఖ్య నాయకులు సైతం టీడీపీని వీడతారనే అనుమానాలు చంద్రబాబును, పార్టీ నేతలను కూడా కలవరపెడుతున్నాయి.