English | Telugu

మ‌‌ద్యం తాగ‌డంలో ఆ ఐదు రాష్ట్రాలే టాప్‌!

దేశంలో ఉత్ప‌త్తి అయ్యే మొత్తం మ‌ద్యంలో 45 శాతం మ‌ద్యాన్ని ఆ ఐదు రాష్ట్రాలే తాగేస్తున్నాయి. క్రెడిట్ రేటింగ్ ఇన్ఫ‌ర్మేష‌న్ స‌ర్వీసెస్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ తెలిపిన స‌ర్వే ప్ర‌కారం ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ‌, త‌మిళ‌నాడు, క‌ర్ణాట‌క‌, కేర‌ళ రాష్ట్రాల ప్ర‌జ‌లు మ‌ద్యం గ‌రిష్టంగా వినియోగిస్తున్నార‌ని తెలిపింది.

అత్య‌ధికంగా మ‌ద్యం వినియోగించే రాష్ట్రంగా త‌మిళ‌నాడు మొద‌టి స్థానంలో నిలిచింది. దేశంలో ఉత్ప‌త్తి అయ్యే మ‌ద్యంలో 13శాతం ఆ రాష్ట్రంలోనే వినియోగిస్తున్నారు. త‌రువాతి స్థానంతో పోటి ప‌డుతూ క‌ర్ణాట‌క రాష్ట్రం 12శాతం వినియోగిస్తుంది. జాతీయ మ‌ద్యం ఉత్ప‌త్తి మొత్తంలో తెలంగాణ రాష్ట్రం 6శాతం, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో 7 శాతం, కేర‌ళ రాష్ట్రం 5 శాతం వినియోగిస్తున్నాయి.

ఈ ఐదు ద‌క్ష‌ణాది రాష్ట్రాల‌తో క‌లిపి ఉత్త‌రాది రాష్ట్రాలైన ఢిల్లీ, పంజాబ్‌, ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌, ప‌శ్చిమ‌బెంగాల్‌, మ‌ధ్య‌ప్ర‌దేశ్‌, రాజ‌స్థాన్ మొత్తం 12 రాష్ట్రాల్లో 75శాతం మ‌ద్యం వినియోగంలో ఉందని తేలింది.

ఆదాయం విష‌యానికి వ‌స్తే కేవ‌లం 3.3 కోట్ల జ‌నాభా ఉన్న కేర‌ళ రాష్ట్రం త‌మ ఆదాయ వ‌న‌రుల్లో మ‌ద్యం అమ్మ‌కాల ద్వారా 15 శాతం రెవెన్యూ సాధించి దేశంలోనే మొద‌టి స్థానంలో ఉంది. దేశంలోని ఇత‌ర రాష్ట్రాల‌తో పోలిస్తే కేర‌ళ ప్ర‌భుత్వం మ‌ద్యంపై అత్య‌ధిక ప‌న్ను వ‌సూలు చేస్తుంది. కేర‌ళతో పాటు త‌మిళ‌నాడు ప్ర‌భుత్వం కూడా రాష్ట్ర ఆదాయంలో 15 శాతం వాటా మ‌ద్యం అమ్మ‌కాల ద్వార పొందుతోంది.

రాష్ట్రాల వారిగా మ‌ద్యం రెవెన్యూ శాతం చూస్తే క‌ర్ణాట‌క‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్ 11శాతం, తెలంగాణ 10శాతం క‌లిగి ఉన్నాయి. జాతీయ జ‌నాభాలో 4 శాత‌మే ఉన్న ఢిల్లీ రాష్ట్రం మ‌ద్యం ఆదాయం విష‌యంలో దేశంలో మూడో స్థానంలో ఉంది.