English | Telugu
తెలంగాణాలో లాక్ డౌన్ మరింత కఠినం: డీజీపీ
Updated : Apr 20, 2020
పాసు కలిగిన వ్యక్తి ఏ సమయానికి ఏ మార్గంలో వెళ్లాలనే విషయం గుర్తిస్తామన్నారు. కొత్త పాసులు ఇచ్చే వరకు పాత పాసులు కొనసాగుతాయి. నిత్యవసరాల కొనుగోలుకు 3 కిలోమీటర్ల లోపు మాత్రమే వెళ్లాలి. వాహనదారులు రెసిడెన్స్ ప్రూఫ్తోనే బయటకు రావాలన్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పని చేసే ఉద్యోగులకు పాసులు ఇస్తామన్నారు. కలర్ కోడ్ ప్రకారం సంస్థలు ఉద్యోగులకు పాసులు ఇవ్వాలని పోలీసులకు సూచించారు.
లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించడంతో రాష్ర్ట వ్యాప్తంగా 1.21 లక్షల వాహనాలు సీజ్ చేశామన్నారు. లాక్ డౌన్ పూర్తయ్యాక ఆ వాహనాలను కోర్టులో డిపాజిట్ చేస్తామన్నారు. కోర్టు ద్వారానే వాహనాలు తీసుకోవాలి.
సాధారణ జబ్బుల చికిత్సకు సమీప ఆస్పత్రులకు వెళ్లాలి. తీవ్ర ఆరోగ్య సమస్య ఉండి దూరం వెళ్తే రిఫరెన్స్ పత్రాలు వెంట తీసుకురావాలి. ఆస్పత్రులకు వెళ్లే వారు కూడా రెసిడెన్స్ ప్రూఫ్స్ తీసుకురావాలని డీజీపీ సూచించారు. రేషన్ దుకాణాలు, బ్యాంకుల వద్ద భౌతిక దూరం తప్పనిసరిగా పాటించాలి. ఆహార పంపిణీ చేసేవారు భౌతిక దూరం పాటించే బాధ్యత తీసుకోవాలని. ఇళ్లల్లోనూ భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకోవడంపై చర్చించామన్నారు.