English | Telugu

బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకు టీడీపీ.. జీవో 176 అమలుకు డిమాండ్...

ఆంధ్రప్రదేశ్ స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను తగ్గింపును సవాలు చేస్తూ టీడీపీ నేతలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు తీర్పును సుప్రీంలో సవాలు చేశారు. ఎంపీ రామ్మోహన్ నాయుడు, మాజీ ఎంపీలు కొనకళ్ల నారాయణ, నిమ్మల కిష్టప్ప, అలాగే మాజీ మంత్రి కొల్లు రవీంద్ర కలిసి అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్ వేశారు. ఏపీ స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల కుదింపు నిర్ణయం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కనుసన్నల్లోనే జరిగిందని ఆరోపించారు. జగన్ అధికారంలోకి రావడానికి బీసీలు సహకరిస్తే, చివరికి వాళ్ల కన్నుల్లో పొడుస్తూ, రిజర్వేషన్లు కుదించారని మండిపడ్డారు. బీసీ రిజర్వేషన్లు తగ్గడం కారణంగా, రాష్ట్రవ్యాప్తంగా 15వేల పదవులను బీసీలు కోల్పోనున్నారని అన్నారు.

అయినా, సొంత కేసుల్లో కోట్లాది రూపాయలు ఖర్చు పెడుతూ సీనియర్ న్యాయవాదులను పెట్టుకునే జగన్మోహన్ రెడ్డి.... బీసీల కేసుల విషయంలో మాత్రం ఎందుకు సమర్ధుడైన లాయర్ ను నియమించలేదని టీడీపీ నేతలు ప్రశ్నించారు. ఇప్పటికైనా, జీవో 176ను యథాతథంగా అమలు చేయాలని ఎంపీ రామ్మోహన్ నాయుడు డిమాండ్ చేశారు. నిజంగానే జగన్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే, 34శాతమున్న బీసీ రిజర్వేషన్లు... 24శాతానికి ఎలా పడిపోతుందని మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్ప ప్రశ్నించారు. బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకుంటున్నారే తప్ప, వాళ్లకు న్యాయం చేయడం లేదని జగన్ పై మండిపడ్డారు.

బీసీలకు రాజ్యాధికారం దక్కకూడదన్న దురుద్దేశంతోనే జగన్ ప్రభుత్వం ఇలాంటి చర్యలకు పాల్పడుతోందని మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణ ఆరోపించారు. అయినా, కోర్టుల ద్వారా బీసీ రిజర్వేషన్లకు అమలుకు ఎదురవుతున్న ఇబ్బందులను ప్రభుత్వం ముందే ఎందుకు గుర్తించలేదని కొనకళ్ల ప్రశ్నించారు. బీసీ రిజర్వేషన్లపై జగన్ ప్రభుత్వం సరిగా పట్టించుకోకపోవడం వల్లే, తాము సుప్రీంను ఆశ్రయించామన్న టీడీపీ నేతలు... బలహీనవర్గాలకు న్యాయం చేయకపోతే, బీసీల ద్రోహిగా జగన్మోహన్ రెడ్డి చరిత్రలో నిలిచిపోతారని విమర్శించారు.