English | Telugu

కేసీఆర్ ఏం చెప్పినా చప్పట్లు కొట్టాలా?

కరోనా వ్యాప్తికి పరోక్షంగా కేసీఆరే బ్రాండ్ అంబాసిడర్‌గా మారారని ఎంపీ రేవంత్ రెడ్డి ఆరోపించారు. తప్పుడు ప్రచారాలు చేస్తోన్న కేసీఆర్ పై డీజీపీ ఎందుకు కేసు బుక్‌చేయ‌డం లేద‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. మొదట్లో కరోనా వస్తే పారాసిటమల్ వేసుకుంటే సరిపోతుందన్న కేసీఆర్ ఇప్పుడు అది భయంకరమైన రోగం అంటున్నారని గుర్తు చేశారు. ఒక ముఖ్యమంత్రి నోటికొచ్చినట్టు మాట్లాడటమేంటని ఆయ‌న అన్నారు. అన్నీ తనకే తెలిసినట్టు సీఎం కేసీఆర్ బుర్ర లేకుండా వ్యవహరించవద్దని రేవంత్ రెడ్డి సూచించారు.

కరోనాపై కేసీఆర్ ఎన్నిసార్లు మాటమార్చారో చూసుకుంటే ఆయనకే సిగ్గేస్తుందని, ఏప్రిల్ ఏడు తర్వాత కరోనా ఉండదన్న కేసీఆర్... తాజాగా జూన్ మూడు అంటున్నారని ఎంపీ రేవంత్ రెడ్డి మండిపడ్డారు. కేసీఆర్ ఏం చెప్పినా చప్పట్లు కొట్టాలా అని ప్రశ్నించారు. తన తప్పుడు పనులను ప్రశ్నించే వాళ్లకు కరోనా రావాలని కేసీఆర్ కోరుకుంటున్నారని రేవంత్ రెడ్డి విమర్శించారు.

రోజువారీ కూలీలకు కనీస వసతులు కల్పిస్తే వాళ్లు రోడ్లపైకి రారని రేవంత్ రెడ్డి అన్నారు. పేదల కోసం వందల కోట్ల విరాళాలు వస్తున్నాయని వాటన్నింటినీ వారికి అందేలా చర్యలు తీసుకోవాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.