English | Telugu

చిక్కుల్లో జనసేనాని... వైరల్ అవుతోన్న వీడియో...

జనసేన అధినేత పవన్ కల్యాణ్, కర్నూలు పర్యటనలో మాట్లాడిన వీడియో, ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మూడు రాజధానుల రగడ, తాజాగా పవన్ చేస్తున్న ట్వీట్లను కూడా జత చేస్తూ, షేర్ల మీద షేర్లు చేస్తున్నారు. అప్పుడలా, ఇప్పుడిలా అంటూ కామెంట్లు చేస్తున్నారు. అమరావతే మనకు రాజధాని కావొచ్చు. నా మనసుకి మాత్రం కర్నూలే రాజధాని. జనసేన ప్రభుత్వం వచ్చిన రోజు అమరావతి ఏ స్థాయి నగరం అవుతుందో అంతకుమించిన నగరంగా కర్నూలుని తీర్చిదిద్దుతా. కర్నూలుకి, రాయలసీమకి పూర్వవైభవం తీసుకొస్తానంటూ పవన్ అన్న మాటలు ఇప్పటికీ జనసేన పార్టీ ఫేస్‌బుక్ అధికారిక అకౌంట్‌లో ఉండటంతో... నాడు కర్నూల్‌పై ప్రేమ కురిపించిన పవన్ కల్యాణ్, నేడు హైకోర్టు ప్రతిపాదనపై ఎందుకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని, రాయలసీమ వాసులు విమర్శిస్తున్నారు. తన మనసులో ఇప్పటికీ కర్నూలే రాజధాని అన్న పవన్... నేడు మరో రాజధాని అవుతున్నందుకు ఎందుకు వ్యతిరేకిస్తున్నారని ప్రశ్నిస్తున్నారు.

అయితే, ఇప్పుడు మూడు రాజధానుల ప్రతిపాదనను జనసేనాని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. హైకోర్టు కర్నూల్‌లో ఉంటే శ్రీకాకుళం నుంచి కర్నూల్‌కి వెళ్లాలా? అనంతపురం నుంచి ఉద్యోగులు విశాఖ వెళ్లి ఉద్యోగాలు చేయాలా? సామాన్య ప్రజలకు ఏదైనా కోర్టు, లేదా సెక్రటేరియట్‌లో పని ఉంటే వెళ్లడం సాధ్యమయ్యే పనేనా? అంటూ పవన్ ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు, అసలు అమరావతికే దిక్కు లేదు, ఇకమ మూడు రాజధానులా అంటూ ఎద్దేవా చేస్తున్నారు. అసలు ఇది సాధ్యమయ్యే పనేనా? అంటూ ప్రశ్నిస్తున్నారు. అయితే, రాయలసీమ వాసులు మాత్రం... గతంలో మాట్లాడిన మాటలను... ఇప్పటి ట్వీట్లను జతచేసి జనసేనానికి చుక్కలు చూపిస్తున్నారు. అప్పుడేమో కర్నూలు గురించి అలా మాట్లాడి, ఇప్పుడేమో మరోలా మాట్లాడుతున్నారని సోషల్ మీడియాలో ట్రెండ్‌ చేస్తున్నారు.

మొత్తానికి నాటి ప్రసంగం వీడియో, నేటి ట్విట్టర్‌ కామెంట్లు, జనసేన అధినేతను ఇరుకునపెడుతున్నాయి. ఇక, మూడు రాజధానులను వ్యతిరేకిస్తే, మిగతా రెండు ప్రాంతాల్లో పార్టీకే నష్టమని అంటున్నారు. విపక్షాలకు ఈ పరిణామం విపత్కరంగా మారిందని, ఏం మాట్లాడినా మరో ప్రాంతంలో వ్యతిరేకత రావడం ఖాయమని చెబుతున్నారు. టీడీపీ, జనసేనలు ఈ సంక్లిష్ట పరిస్థితుల నుంచి ఎలా బయటపడతాయో, మూడు ప్రాంతాల ప్రజలను ఎలా ఒప్పిస్తాయో, కాలమే తేల్చాలి.