English | Telugu

గువాహటి సెంట్రల్ జైలులో 435 మంది ఖైదీలకు కరోనా

అసోం రాజధాని గువాహటిలోని సెంట్రల్ జైలులో 435 మంది ఖైదీలు కరోనా బారినపడ్డారు. ఇది జైలులోని మొత్తం ఖైదీల సంఖ్యలో 44 శాతం కావడం గమనార్హం. రాష్ట్రంలోని 10 జైళ్లలో 535 మంది ఖైదీలకు, గువాహటి జైలులో 435 మంది ఖైదీలకు కరోనా వైరస్ సోకినట్లు అసోం జైళ్ల శాఖ డీజీ దశరథదాస్ తెలిపారు. గువాహటి జైలులో ఖైదీల కోసం 200 పడకలతో కరోనా కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్టు చెప్పారు. అలాగే, లక్షణాలు లేని ఖైదీలను నాగాం ప్రత్యేక జైలులో ఉంచాలని నిర్ణయించినట్టు తెలిపారు.

కరోనా నేపథ్యంలో కొంత మంది ఖైదీలను విడుదల చేయాలని అధికారులు యోచిస్తున్నారు. గువాహటి తోపాటు నల్బరి, ధూబ్రీ, కరీంగంజ్, నార్త్ లఖింపూర్, గోలఘాట్, డిఫూ, ఉడాల్ గురి జైళ్లలో సామర్థ్యానికి మించి ఖైదీలు ఉన్నారని, దీంతో 376 మంది ఖైదీలను విడుదల చేయాలని అధికారులు యోచిస్తున్నారు. తొలుత అండర్ ట్రయల్ ఖైదీలను విడుదల చేసేందుకు ప్రతిపాదనలు రూపొందిస్తున్నారు.