English | Telugu

జగన్ సర్కార్ అవినీతిపై విరుచుకుపడ్డ కన్నా

* ఏపి ప్ర‌భుత్వ అవినీతిపై గవర్నర్ జోక్యం చేసుకోవాలి
* భాజ‌పా రాష్ట్ర అధ్య‌క్షుడు క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ లేఖ‌లు

ఆంధ్ర‌ప్ర‌దేశ‌లో జరుగుతున్న అవినీతి, అరాచక పాలనపై గవర్నర్ జోక్యం చేసుకోవాల‌ని,‌ గతంలో నిర్వహించిన స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో పెద్దఎత్తున బెదిరింపులు, దౌర్జన్యాలు చోటుచేసుకున్నాయ‌ని అందుకే ఎన్నికల ప్రక్రియ మొత్తం ఏకగ్రీవం అయ్యాయని, నామినేషన్లు జరిగినవి అన్నీ రద్దు చేసి మొత్తం ప్రక్రియను మ‌ళ్లీ నిర్వ‌హించాల‌ని పేర్కొంటూ ప‌లు అంశాల‌పై భాజ‌పా రాష్ట్ర అధ్య‌క్షుడు క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ గ‌వ‌ర్న‌ర్ బిశ్వ‌భూష‌న్ హ‌రిచంద‌న్‌‌కి సోమ‌వారం 3 లేఖ‌లు రాశారు. ఇంకా ఆయ‌న ఏమ‌న్నారంటే...

స్ధానిక సంస్థల ఎన్నికల్లో నామినేషన్‌లలో జరిగిన అనేక అవకతవకల వలన ఇప్ప‌టివరకూ జరిగిన నామినేషన్ ప్రక్రియను రద్దు చెయాలి. కరోనా ర్యాపిడ్ కిట్ల కొనుగోళ్లు రేటు విషయంలో అవినీతి పై పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలి. విశాఖపట్నంలో తాజాగా జరిగిన భూ కబ్జాపై విచారణ జరిపించాలని, వీటితో పాటుగా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి అమరావతి రైతులకు ఇవ్వాల్సిన లీజు రెట్టింపు చేయాలి. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసిన కరోనా పరీక్షల కిట్లు కొనుగోలులో పెద్దయెత్తున జరిగిన అవినీతిపై గవర్నర్ జోక్యం చేసుకుని రాష్ట్ర ప్రభుత్వాన్ని నివేదిక కోరాలి. విధినిర్వహణలో ముందు వరసలో ఉండి పనిచేస్తున్న జర్నలిస్ట్ సోదరులకు కూడా రాష్ట్ర ప్రభుత్వం రూ.10లక్షల బీమా సౌకర్యం కల్పించాలి. కరోనా బాధితులు, ఆసుపత్రులు, క్షేత్రస్థాయిలో ప్రాణాలకు తెగించి పనిచేస్తున్న పాత్రికేయులకు బీమా సౌకర్యం కల్పించడం ఎంతో ముఖ్యమని బీజేపీ ప్రభుత్వానికి తెలియజేస్తుంది. అమరావతి రాజధానికి భూములిచ్చిన రైతులు ఈ కరోనా మహమ్మారి లాక్ డౌన్ సమయంలో ఉపాధి కోల్పోయి అన్ని ఆదాయ మార్గాలు మూసుకుపోయి ఇబ్బందులు ఎదుర్కొంటున్న కారణంగా ప్రభుత్వం ఇవ్వవలసిన లీజును రెట్టింపు చేయాలని, తక్షణం వారికి ఆ మొత్తాన్ని విడుదల చేయాలి. కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్న కర్నూల్, గుంటూరు మరియు విజయవాడలో ప్రభుత్వం లాక్ డౌన్ నిబంధనలను కఠినతరం చేయాలి. ఎటువంటి మినహాయింపులు, ఏ వర్గానికి ఇవ్వటం మంచిది కాదు. రెడ్ జోన్ ఏరియాలలో ప్రజలు బయటకు రాకుండా నిత్యావసర వస్తువులు, కూరగాయలు, అవసరమైన మందులు, అన్నీ ఇండ్ల వద్దకే చేర్చే ఏర్పాట్లు చేయాలి. ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరికీ ఉచితంగా ప్రతి వ్యక్తికీ మూడు మాస్కులు అందజేస్తామని చెప్పిన విషయం మరిచిపోయింది. ఏం ఒక్కరికీ ఇచ్చిన పాపాన పోలేదు. తక్షణం ఈ మాస్కుల పంపిణీ చేపట్టాలి. వైసీపీ చేసే ప్రతి రాజకీయ ఆరోపణ కు లాక్ డౌన్ ముగిసిన తర్వాత ధీటుగా సమాధానం చెప్తాం. ప్రస్తుతం రాజకీయ అరోపణల జోలికి వెళ్లకుండా సమస్యలను మాత్రమే ప్రభుత్వ దృష్టికి తీసుకొస్తున్న బీజేపీపై అసందర్భ ఆరోపణలు చేస్తున్న మంత్రి వెల్లంపల్లి నోరు అదుపులో పెట్టుకోవాల‌ని ఈ సంద‌ర్భంగా క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ హెచ్చ‌రించారు.