English | Telugu

జూబ్లీ ఉప ఎన్నిక.. మంత్రులకు కీలక బాధ్యతలు

జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక కోసం డివిజన్ల వారీగా మంత్రులకు సీఎం రేవంత్‌రెడ్డి బాధ్యతలు అప్పగించారు. యూసఫ్ గూడ డివిజన్ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ రహమత్ నగర్ డివిజన్‌కు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెంగల్ రావు నగర్ డివిజన్‌‌కు తుమ్మల నాగేశ్వరరావు, వాకిటి శ్రీహరి సోమాజిగూడ డివిజన్‌‌కు శ్రీధర్‌ బాబు, అడ్లూరి లక్ష్మణ్ బోరబండ డివిజన్ మంత్రి సీతక్క, ఎంపీ మల్లు రవి షేక్ పేట్ డివిజన్‌‌కు కొండా సురేఖ, వివేక్ వెంకటస్వామి ఎర్రగడ్డ డివిజన్‌‌కు దామోదర రాజనర్సింహ, జూపల్లి కృష్ణారావు ప్రచార బాధ్యతలు ఇచ్చారు.

మరోవైపు జూబ్లీ బైపోల్ కీలక దశకు చేరుకున్నది. ప్రధాన పార్టీలు ప్రచారంలో జోరు పెంచాయి. ఇక్కడ గెలుపు కోసం మూడు పార్టీల నేతలూ చెమటోడుస్తున్నారు. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌, బీజేపీ నాయకులు తమ ప్రచారాన్ని ఉధృతం చేశారు. ఇప్పటికే మంత్రులు, కాంగ్రెస్‌ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులు పార్టీ అభ్యర్థి నవీన్‌ యాదవ్‌కు మద్దతుగా విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు.

మరోవైపు బీఆర్‌ఎస్‌.. ఇప్పుడు దానిని మరింత ముమ్మరంచేసింది. ఆ పార్టీ అగ్ర నాయకులు కేటీఆర్‌, హరీశ్‌ రావు గత వారం రోజులుగా నియోజక వర్గంలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. బీఆర్‌ఎస్ అభ్యర్థి మాగంటి సునీత ప్రచారంలో దూసుకువెళ్తున్నారు. ఈ ఎన్నికల్లో కమలం పార్టీకి కఠిన పరీక్ష ఎదుర్కొన్నారు.

కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న సికింద్రాబాద్‌ లోక్‌సభ పరిధిలో జూబ్లీహిల్స్‌ అసెంబ్లీ నియోజకవర్గం ఉండడంతో ఇక్కడ పార్టీ అభ్యర్థిని గెలిపించుకునే భారమంతా ఆయనపైనే పడుతోంది. పార్టీ గెలిచినా ఓడినా బాధ్యత అంతా కిషన్‌రెడ్డిదే అనే ప్రచారం పార్టీలో సాగుతోంది. దీంతో కిషన్‌రెడ్డి ఈ ఎన్నికను సవాల్‌గా తీసుకున్నారని కాషాయ పార్టీ నాయకులు చెబుతున్నారు. ప్రస్తుతం కిషన్‌రెడ్డి మార్గదర్శనంలోనే ఎన్నికల ప్రచారం జరుగుతోంది.