English | Telugu
రిపేర్లకు నోచుకోక మూల పడనున్న 4 కోట్ల మొబైల్ ఫోన్లు!
Updated : Apr 25, 2020
దేశంలో ప్రస్తుతం 85 కోట్ల మొబైల్ ఫోన్లు ఉపయోగిస్తున్నారు. సరాసరిన నెలకు 2.5 కోట్ల కొత్త మొబైల్ ఫోన్ల విక్రయాలు జరుగుతాయి. లాక్డౌన్ ఆంక్షలు ఇలాగే కొనసాగితే దేశంలో మొబైల్ ఫోన్లు వినియోగిస్తున్న వారిలో సుమారు 4 కోట్ల మంది చేతుల్లో వచ్చే నెలాఖరు నాటికి అవి కనిపించకపోవచ్చని పరిశ్రమ సమాఖ్య ఐసియా (ఇండియా సెల్యులార్ అండ్ ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్) అంచనా వేస్తోంది.
పోన్లలో వచ్చే చిన్న చిన్నే రిపేర్ల కారణంగా దాదాపు 4కోట్ల మొబైల్ ఫోన్లు మే నెలాఖరుకు పనిచేయవని మార్కెట్ అంచనాలు తెలుపుతున్నాయి. మొబైల్ ఫోన్లు, విడి భాగాల విక్రయాలపై లాక్డౌన్ ఆంక్షలు ఇలాగే కొనసాగితే ఆ పరిస్థితి తలెత్తే అవకాశం వుందట. అత్యవసర వస్తువుల జాబితాలో మొబైల్ ఫోన్లను కూడా చేర్చాలంటూ ఇప్పటికే పలుమార్లు ప్రధానితో సహా ప్రభుత్వాన్ని కోరామని ఐసియా ఛైర్మన్ పంకజ్ మొహింద్రూ వెల్లడించారు. మొబైల్ పరికరాలతో పాటు ల్యాప్టాప్లను కూడా అత్యవసర వస్తువుల జాబితాలో చేర్చండంటూ హోం శాఖకు ఇప్పటికే ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ సిఫార్సు చేసింది. అయితే ఇంకా ఆ శాఖ నుంచి నిర్ణయం వెలువడాల్సి ఉంది.
లాక్డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో సరఫరా చెయిన్లో మొబైల్ ఫోన్ల విడిభాగాలు లేకపోవడం, కొత్త హ్యాండ్సెట్ల విక్రయాలపై ఆంక్షలుండటంతో ప్రస్తుతం 2.5 కోట్ల మందికి పైగా వినియోగదారుల ఫోన్లు నిరుపయోగంగా ఉన్నాయని ఐసియా పేర్కొంది.