English | Telugu

గాంధీ ఆసుపత్రి కంటే జైలు బెటర్.. ఓవైసీ సంచలన వ్యాఖ్యలు

గాంధీ ఆసుపత్రి కంటే జైలే బెటరని ఎంఐఎం నేత, ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. గాంధీ ఆసుపత్రిలో కోవిడ్ 19కు సరైన వసతులు లేవంటూ అనేక ఫిర్యాదులు అందుతున్నాయని చెప్పారు. గాంధీలో పేషంట్లు ఏవిధంగా ఇబ్బందులు పడుతున్నారో తనకు వివరించారని తెలిపారు. ఆసుపత్రిలో పారిశుద్ధ్యం సరిగ్గా లేదని. ఆహారం బాగా లేదని, మందులు సక్రమంగా ఇవ్వడం లేదనే విషయాలు తమ దృష్టికి వచ్చాయని వాపోయారు. కొంత మంది సిబ్బంది రోగుల ప‌ట్ల వివ‌క్ష‌పూరితంగా వ్య‌వ‌హ‌రించిన‌ట్లు త‌న‌కు ఫిర్యాదులు వ‌చ్చాయ‌ని ఓవైసీ చెప్పారు.

కేవలం సామాజిక దూరం పాటించ‌డం మాత్రాన వైరస్ వ్యాప్తిని కట్టడి చేయలేమని.. పరిసరాలు కూడా పరిశుభ్రతగా ఉండాలని ఆయన అన్నారు.

గచ్చిబౌలి స్టేడియాన్ని కోవిడ్ 19 ఆసుపత్రిగా మార్చినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. అంతేకాకుండా సెక్రటేరియట్‌లో కూడా కరోనా అనుమానితుల క్వారంటైన్‌ను ఏర్పాటు చేయాలన్నారు. టెస్టులు సంఖ్య కూడా పెంచాలని తెలిపారు.

హైద‌రాబాద్‌లోని స్థానిక‌ ఆసుపత్రిలలో ఓపి సేవలను పునరుద్ధరించాలని ఓవైసీ డిమాండ్ చేశారు. పెండింగ్‌లో ఉన్న ఆరోగ్యశ్రీ బిల్లులను వెంటనే విడుదల చేయాలని అక్బరుద్దీన్ కోరారు. అవ‌స‌ర‌మైతే ఓవైసీ గ్రూప్స్ ఆసుపత్రిలు, డాక్టర్లు, నర్సులు కోవిడ్ 19తో పోరాడటానికి సిద్డంగా ఉన్నారని అక్బరుద్దీన్ అన్నారు.