English | Telugu
ఏప్రిల్ నుంచే H1B వీసా కొత్త నిబంధనలు
Updated : Mar 9, 2020
అమెరికా సిటిజన్షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ ఏటా 85వేల హెచ్-1బీ వీసాలను జారీ చేస్తోంది. వీటిల్లో అత్యధికంగా భారతీయులు పొందుతుండగా.. వారిలో కూడా 70శాతం ఐటీ ఉద్యోగులకే లభిస్తున్నాయి.
ప్రస్తుతం 65,000 హెచ్-1బీ వీసాలు మాత్రమే జారీ చేస్తున్నారు. దీనికి అదనంగా అమెరికాలో ఉన్నత విద్య(మాస్టర్స్ డిగ్రీ, అంతకంటే ఎక్కువ స్థాయి విద్య) పూర్తి చేసిన మరో 20,000 మంది విదేశీ వృత్తినిపుణలకు వీటిని ఇస్తున్నారు.
ప్రస్తుతం అమెరికా ప్రభుత్వం H1B వీసాల్లో చేసిన మార్పులు ఏప్రిల్ నుంచి అమల్లోకి రానున్నాయి. అప్లికేషన్లను కూడా వచ్చే నెల నుంచి స్వీకరించనున్నారు. తొలుత కంపెనీలు ఎలక్ట్రానిక్(ఆన్లైన్) విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. తర్వాత వీసా ఫీజు కింద ప్రతి అప్లికేషన్కు 10 డాలర్లను చెల్లించాలి. కొత్త విధానం ప్రస్తుతం ఉన్న లాటరీ విధానంలో చాలా మార్పులు తీసుకురానుంది.
ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్లో ఉద్యోగి, యజమానికి సంబంధించిన ప్రాథమిక సమాచారాన్ని మాత్రమే అడుగుతారు. లబ్ధిదారు పూర్తిపేరు, పుట్టిన తేదీ వివరాలు, దేశం, పౌరసత్వం, లింగ సమాచారం, పాస్పోర్టు నంబర్ వంటి వాటితోపాటు జాబ్ ఆఫర్ లెటర్ను కూడా వారికి సమర్పించాల్సి ఉంటుంది.
హెచ్-1బీ వీసాలు రిజిస్ట్రేషన్ సమయంలో యాదృచ్చికంగా స్క్రీనింగ్ చేస్తారు. ఆ తర్వాత ఎంపికైన వారికి యూఎస్సీఐఎస్ విషయం వెల్లడించి 90 రోజుల్లోపు హెచ్-1బీ వీసాకు పిటిషన్ పెట్టుకోవాలని సూచిస్తారు. ఈ పిటిషన్లను ఏప్రిల్ 1 నుంచి దాఖలు చేయవచ్చు. దీంతో ఎంపిక అయిన వారు మాత్రమే పిటిషన్ దాఖలు చేస్తుండటంతో చాలా ఖర్చు, శ్రమ మిగులుతున్నాయని యూఎస్సీఐఎస్ డిప్యూటీ డైరెక్టర్ మార్క్ కౌమన్స్ పేర్కన్నారు.
హెచ్-1బీ వీసాలు అత్యధికంగా పొందే తొలి 30 కంపెనీల్లో అత్యధికంగా ఐటీ రంగానికి చెందినవే ఉన్నాయి. 2018లో 66శాతం ఈ వీసాలు కంప్యూటర్కు సంబధించిన ఉద్యోగాలు చేసేవారికే లభించాయి.