English | Telugu

జులైలో కరోనా తారస్థాయికి చేరుకుంటుంది! ప్రపంచ ఆరోగ్యసంస్థ

భార‌త్‌లో కరోనా వైరస్‌ జూలై నెల‌లో తారస్థాయికి చేరుకుంటుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. ఆ తర్వాత తగ్గుముఖం పడుతుందని వెల్లడించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ రాయబారి డేవిడ్‌ నబరే విడుదల చేసిన ఒక ప్రకటనలోని వివరాల్లో తమిళనాడు గురించి ప్రస్తావించడం చర్చనీయాంశమైంది. ఆయన ఏమన్నారంటే.... భారత్‌లో కరోనా వైరస్‌ కట్టడయ్యేందుకు ముందు జూలైలో ఉచ్చస్థితికి చేరుకుంటుంది. లాక్‌డౌన్‌ ఎత్తివేసిన తర్వాత పాజిటివ్‌ కేసులు భారీగా పెరిగిపోతాయ‌ని ఆయ‌న త‌న నివేదిక‌లో తెలిపారు.

మహారాష్ట్ర, రాజస్థాన్, గుజరాత్, ఢిల్లీ, తమిళనాడులో వైరస్‌ ప్రభావం ఎక్కువగా ఉంది. తమిళనాడు కోయంబేడు మార్కెట్‌ 2,167 మందిని బాధితులుగా మార్చింది. పొరుగు జిల్లాల నుంచి వచ్చే హోల్‌సేల్, రిటైల్‌ కూరగాయల వ్యాపారులు భౌతికదూరం పాటించడంలో నిర్లక్ష్యాన్ని చూపడం శాపంగా మారింది.

ప్రజలు భయపడాల్సిన అవసరం లేదు. పాజిటివ్‌ కేసులు పెరిగినా వైరస్‌ వ్యాప్తి స్థిరంగా ఉంటుంది. భారత్‌ అత్యంత వేగంగా కట్టుబాటు చర్యలను అమల్లోకి తెచ్చినందున వైరస్‌ను కొన్ని ప్రాంతాలకే పరిమితం చేయగలిగారు. జనాభా అత్యధికంగా ఉండే భారత్‌లో వైరస్‌ కట్టడి చేయడం ఎంతో కష్టం. భారత్‌లో లాక్‌డౌన్‌ చర్య ఎంతో మంచి ఫలితాలను ఇచ్చిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ రాయబారి డేవిడ్‌ నబరే అభిప్రాయ‌ప‌డ్డారు.