English | Telugu

కజిరంగా పార్క్‌లో రాయల్ బెంగాల్ టైగర్ మృతి!

అసోం రాష్ట్రంలోని కజిరంగా జాతీయ వనంలో అరుదైన రాయల్ బెంగాల్ టైగర్ కళేబరం వెలుగుచూసింది. కజిరంగా జాతీయ వనంలోని బగోరి రేంజ్ లో పులి కళేబరాన్ని అటవీశాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ పులి కళేబరానికి పశువైద్యాధికారులు పోస్టుమార్టం నిర్వహించారు. ఈ పులి ఏడు రోజుల క్రితం మరణించి ఉంటుందని పశువైద్యులు తేల్చారు.

ఈ ఏడాది కజిరంగా జాతీయ వనంలో ఒక పులి మరణించింది. మళ్లీ రెండో పులి మరణించింది. ఈ పులి కళేబరం వద్ద ఏకే 47 రైఫిల్ తూటాలు లభించాయి. దీంతో వేటగాళ్లు ఈ పులిని చంపి ఉంటారని అటవీశాఖ అధికారులు అనుమానం వ్యక్తం చేశారు. ఈ జాతీయ వనంలో 121 రాయల్ బెంగాల్ పులులున్నాయి. వీటితోపాటు కొమ్ములున్న ఖడ్గమృగాల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. దీంతో పులులు, ఖడ్గమృగాలకు మధ్య దాడులు కొనసాగుతుంటాయి. కరోనా వైరస్ ప్రబలుతున్న నేపథ్యంలో కజిరంగా జాతీయ వనంలో సందర్శకులను నిలిపివేశారు.