English | Telugu
ఏపీలో కలకలం.. కరోనా లక్షణాలతో ఆస్పత్రిలో చేరిన మరో ఆరుగురు!
Updated : Mar 4, 2020
కరోనా వైరస్ లక్షణాలు ఆంధ్రప్రదేశ్ లో కూడా బయటపడుతున్నాయి. విశాఖ, విజయవాడ, ఏలూరులో పలువురు కరోనా అనుమానిత వ్యక్తులు ఆస్పత్రుల్లో చేరారు. వైద్యులు, వారి రక్త నమూనాలను టెస్టుల కోసం ల్యాబ్ లకు పంపించారు. ప్రస్తుతం వారందరినీ ప్రత్యేక ఐసోలేషన్ వార్డుల్లో ఉంచి వైద్యం అందిస్తున్నారు.
పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రిలో ఇద్దరు కరోనా వైరస్ లక్షణాలతో చేరారు. బాధితుల్లో ఒకరు గత నెల 18న మస్కట్ నుంచి వచ్చినట్టుగా గుర్తించారు.
విశాఖలో సింగపూర్ నుంచి వచ్చిన ఓ కుటుంబం కరోనా లక్షణాలతో బాధపడుతుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఆ కుటుంబానికి చెందిన ముగ్గురిని.. విశాఖ చెస్ట్ ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ఐసోలేషన్ వార్డుకు తరలించి చికిత్స అందిస్తున్నారు.
విజయవాడలో ప్రభుత్వ ఆస్పత్రిలో కరోనా లక్షణాలతో ఒక వ్యక్తి చేరాడు. ఉద్యోగ రీత్యా హైదరాబాద్ లో స్థిరపడిన ఆ వ్యక్తి ఇటీవలే జర్మనీకి వెళ్లి వచ్చాడని గుర్తించారు. ఇప్పటికే తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసు నమోదవ్వడంతో.. ఏపీ అధికారులు అప్రమత్తమయ్యారు.