తెలంగాణలో కరోనా విజృంభిస్తోంది. శుక్రవారం ఒక్కరోజే 169 కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో ఒక్కరోజులో ఇన్ని కేసులు నమోదవడం ఇదే తొలిసారి. అలాగే, శుక్రవారం కరోనాతో నలుగురు మృతి చెందారు. దాంతో మరణాల సంఖ్య 71కి చేరింది. ఇక కొత్తగా నమోదైన 169 కేసులలో, స్థానికంగా 100 కేసులు నమోదు కాగా, బయటి నుంచి వచ్చినవారిలో 69 మందికి కరోనా నిర్దారణ అయింది. ముఖ్యంగా, జీహెచ్ఎంసీ పరిధిలో ఒక్కరోజులో 82 మందికి కరోనా నిర్ధారణ కావడం అధికారుల్లో ఆందోళన కలిగిస్తోంది. రాష్ట్రంలో గత మూడు రోజుల్లోనే 400 కు పైగా కేసులు వచ్చాయి. మే 27న 107, మే 28న 158, మే 29న 169 కేసులు.. ఇలా రోజూ 100కు పైగా కేసులు నమోదు కావడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.