English | Telugu
ఇంగ్లీష్ మీడియం తప్పనిసరి జీఓ లను కొట్టివేసిన ఏపీ హై కోర్ట్
Updated : Apr 15, 2020
రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, మండల, జిల్లా పరిషత్ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియాన్ని ప్రవేశపెడుతూ ఏపీ ప్రభుత్వం నవంబరు 6న అధికారిక ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే . వచ్చే విద్యాసంవత్సరం నుంచే ఈ నిర్ణయాన్ని అమలు చేయనున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. అయితే విడతల వారీగా 1 నుంచి 10వ తరగతి వరకు ఇంగ్లిష్ మీడియం విద్యను అమలు చేయాలనీ ప్రభుత్వ ఉద్దేశంగా అప్పట్లో జారీ అయిన ఉత్తర్వుల ద్వారా తెలిసింది.
2020-21 విద్యా సంవత్సరం నుంచి 1 నుంచి 8వ తరగతి వరకు, 2021-22 విద్యా సంవత్సరం నుంచి 9వ తరగతికి, 2022-23 విద్యాసంవత్సరం నుంచి 10 తరగతి విద్యార్థులకు ఈ విధానం అమలు చేయాలని నిర్ణయించినట్టు పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బి.రాజశేఖర్ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఆయా తరగతుల్లో తెలుగు లేదా ఉర్దూను తప్పనిసరి సబ్జెక్టుగా బోధించాలని ఉత్తర్వుల్లో ప్రభుత్వం స్పష్టంగా పేర్కొంది.
దీనిపై మార్గదర్శకాలు ఇలా ఉన్నాయి. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయ-విద్యార్థుల నిష్పత్తికి అనుగుణంగా ఉపాధ్యాయులను ఎప్పటికప్పుడు నియమించేలా చర్యలు తీసుకోవాలి. వచ్చే విద్యా సంవత్సరం నుంచి అన్ని పాఠశాలల్లో 1-8 తరగతులను ఇంగ్లిష్ మీడియంలోకి మారుస్తున్న నేపథ్యంలో.. అందుకు అవసరమైన ఉపాధ్యాయుల సంఖ్యకు సంబంధించిన ప్రతిపాదనలను పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు పంపాలి. ఇంగ్లిష్ మీడియంలో బోధించేందుకు వీలుగా ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచే.. టీచర్లకు శిక్షణా కార్యక్రమాలను తప్పనిసరిగా నిర్వహించాలి. వేసవి సెలవుల్లోనూ శిక్షణా కార్యక్రమాలు కొనసాగుతాయి. టీచర్లలో ఇంగ్లిష్ మీడియంలో బోధన సామర్థ్యం మెరుగుపడే వరకు సంబంధిత సబ్జెక్టు, ఇతర అంశాలపై వారికి తగిన శిక్షణ ఇవ్వాలి. ఇంగ్లిష్ మీడియం బోధనలో సామర్థ్యం ఉన్న అభ్యర్థులనే భవిష్యత్తులో జరిగే ఉపాధ్యాయ నియామకాల్లో నియమించుకోవాలి. ఇంగ్లిష్ లాంగ్వేజ్ టీచింగ్ సెంటర్లు, డిస్ట్రిక్ట్ ఇంగ్లిష్ సెంటర్లను.. డిస్ట్రిక్ట్ ఇన్స్టిట్యూట్స్ ఫర్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్లుగా మార్చేందుకు చర్యలు తీసుకోవాలి.సంబంధిత ఉపాధ్యాయులు ఇంగ్లిష్ మీడియంలో బోధించడానికి వీలుగా.. వారికి అవసరమైన నైపుణ్యం, అవగాహన కల్పించడం కోసం ప్రత్యేక శిక్షణ, హ్యాండ్ బుక్స్ రూపకల్పన, ఉత్తమ బోధన పద్ధతుల గురించి వివరించడం, వారికి అవసరమైన మెటీరియల్ను రూపొందించే బాధ్యతను స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ అండ్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (ఎస్సీఈఆర్టీ)కి అప్పగించింది.