English | Telugu

'వాట్సాప్ పాఠాలు'... ఏపీ ప్రభుత్వం నిర్ణయం!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పదవ తరగతి చదువుతున్న విద్యార్ధులకు... సిలబస్‌ను వాట్సాప్ సహా ఇతరత్రా సోషల్ మీడియా ప్లాట్‌ఫాంల ద్వారా విద్యార్ధులకు అందించాలని సూచనప్రాయంగా నిర్ణయించింది. ఇందుకోసం... ప్రతీ పాఠశాలకూ ఓ ‘వాట్సాప్ గ్రూప్’ను ఏర్పాటు చేయాలని భావిస్తోంది. ఒక పాఠశాలలోని విద్యార్ధులు, టీచర్లు... ఒక గ్రూపులో ఉంటారు. పదవ తరగతి పరీక్షల కోసం... విద్యార్ధులకు అవసరమైన ప్రాక్టీస్ ప్రశ్నలను వాట్సాప్ మీడియా ద్వారా అందించనున్నట్లు సమాచారం.

‘ఆన్‌లైన్’ ద్వారా తరగతులను నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కసరత్తు చేస్తోంది. మొత్తం పాతిక వేల మంది వరకు విద్యార్ధులు, మరో 933 మంది ఉపాధ్యాయులు ఈ వాట్సాప్ గ్రూపులో చేరాల్సి ఉంటుంది. ఉపాధ్యాయులు తమ క్లాసులను వీడియో రికార్డ్ చేసి ‘ యూ ట్యూబ్‌’లో అప్‌లోడ్ చేస్తారు.
సంబంధిత ‘యూఆర్‌ఎల్ లింక్’లను వాట్సాప్ గ్రూప్ లేదా ‘ఈ-మెయిల్’ ద్వారా విద్యార్ధులకు పంపుతారు. ఆ వీడియోల ద్వారా విద్యార్ధులు తరగతులను ఫాలో కావాల్సి ఉంటుంది.

అలాగే విద్యార్ధులు తాము తయారు చేసుకునే నోట్స్‌ను కూడా వాట్సాప్ లేదా ఈ-మెయిల్ ద్వారా ఉపాధ్యాయులకు పంపాల్సి ఉంటుంది. మొత్తంమీద ఈ విధానంతో కరోనాను కట్టడి చేయడంతోపాటు విద్యార్ధులకు సమయం కూడా కలిసి వస్తుందని భావిస్తున్నారు. ఇదిలా ఉండగా ఇంటర్మీడియెట్ విద్యార్ధులకు కూడా ఇదే విధానాన్ని రానున్న విద్యా సంవత్సరం నుంచి ప్రారంభించేందుకు ప్రభుత్వం యోచిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.