English | Telugu

తమిళనాట కలకలం రేపుతోన్న జగన్ పోస్టర్...

ఆంధ్రప్రదేశ్‌‌ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్, మధ్యలో తమిళ స్టార్ హీరో విజయ్. ఈ ముగ్గురు ఫొటోలతో వెలిసిన పోస్టర్లు, తమిళనాట సంచలనంగా మారాయి. జగన్, పీకే ఇద్దరూ కలిసి, విజయ్‌కు ఏదో చెబుతున్నట్టుగా పోస్టర్లలో కనిపిస్తోంది. అయితే, ఆంధ్రప్రదేశ్‌ను మేం కాపాడుకున్నాం... తమిళనాడును మీరే కాపాడాలంటూ...జగన్‌, పీకేలు విజయ్‌కు చెబుతున్నట్టు పోస్టర్లపై రాశారు. దాంతో, ఈ పోస్టర్ తమిళనాట కలకలం రేపుతోంది. విజయ్ నివాసాలు, కార్యాలయాలపై ఐటీ రైడ్స్ ప్రకంపనలు రేపుతున్నవేళ పలుచోట్ల వెలిసిన పోస్టర్లు తమిళ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. ఇదేదో ఆకతాయిల పనైనట్టుగా అనిపిస్తున్నా, దీని వెనక అర్థాలు చాలా ఉన్నాయంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

హీరో విజయ్‌ నివాసాలు, కార్యాలయాలపై ఇటీవలే ఆదాయపన్నుశాఖ అధికారులు రైడ్స్ చేశారు. అనంతరం నోటీసులు కూడా ఇచ్చారు. అయితే, ఐటీ రైడ్స్ పై విజయ్ ఘాటుగా స్పందించాడు. రజనీకాంత్‌లాగా సీఏఏకు అనుకూలంగా మాట్లాడి, ఐటీ దాడుల నుంచి తప్పించుకోగలను, కానీ తాను భారత రాజ్యాంగానికి బద్దున్ని, అలాగే చట్ట విరుద్ధంగా తన దగ్గర ఒక్క రూపాయి కూడా లేదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. విజయ్ చేసిన ఆ వ్యాఖ్యలు రచ్చరచ్చ చేశాయి. దాంతో, తమ అభిమాన హీరోను బీజేపీ కావాలనే టార్గెట్ చేసిందని విజయ్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. అందుకే, విజయ్ రాజకీయాల్లోకి రావాలంటూ ఆయన అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మధురైతో పాటు కొన్ని ప్రాంతాల్లో ఇలాంటి పోస్టర్లు వెలుస్తున్నాయి.

అయితే, విజయ్‌-బీజేపీ సమరం ఇఫ్పటిది కాదు. చాలాకాలం నుంచి సాగుతున్నదే. అదిరింది మూవీలో, బీజేపీకి వ్యతిరేకంగా విజయ్ డైలాగ్స్ చెప్పాడు. చిన్న పిల్లలకు ఆక్సిజన్ అందించలేని, చేతకాని ప్రభుత్వాలంటూ, యూపీ యోగి సర్కారుపై పరోక్షంగా చెలరేగిపోయారు. అది వివాదాస్పదమవడంతో చివరికి ఆ డైలాగ్‌ను కట్‌ చేశారు. ఇఫ్పుడు తమిళనాడులో జయలలిత మరణం తర్వాత ఏర్పడిన రాజకీయ శూన్యతను భర్తీ చేసేందుకు, రజనీకాంత్, కమల్‌హాసన్‌లు ప్రయత్నిస్తున్నారు. రజనీ అయితే, బీజేపీతో కలిసి సాగేందుకు సంకేతమిస్తున్నారు. ఈ నేపథ్యంలో, తమిళనాడులో విశేష అభిమానులున్న విజయ్‌ సైతం, పాలిటిక్స్‌లోకి రావాలన్న డిమాండ్ పెరుగుతోంది. అందుకే రజనీకాంత్‌‌కు ఎక్కడ పోటీ అవుతాడోనన్న భావనతోనే ...విజయ్‌కు వ్యతిరేకంగా బీజేపీ పావులు కదుపుతోందన్న చర్చ జరుగుతోంది. విజయ్‌పై క్రిస్టియన్‌ అన్న ముద్ర వేసేందుకు, బ్లాక్‌మనీ దాచుకున్నాడని ఆరోపించేందుకు అన్ని అస్త్రాలనూ సంధిస్తోందన్న మాటలు వినపడ్తున్నాయి.

మొత్తానికి విజయ్‌ సైతం రాజకీయాల్లోకి రావాలని తపిస్తున్న అభిమానులు, విజయాల వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌‌తో కలిసి పని చేయాలని ఆకాంక్షిస్తున్నారు. అందుకే అక్కడక్కడా పోస్టర్లు అతికిస్తున్నారు. పీకే, విజయ్‌లిద్దరికీ బీజేపీ ఉమ్మడి శత్రువు కావడంతో, ఇద్దరూ కలిసి ఏపీ, ఢిల్లీ తరహాలో విజయఢంకా మోగించాలని కోరుకుంటున్నారు. ఏపీలో రావాలి జగన్-కావాలి జగన్ అంటూ.... ఢిల్లీలో లగే రహో కేజ్రీవాల్ అంటూ సరికొత్త నినాదాలను అందించి విజయాలను చేకూర్చిపెట్టిన పీకే... తమిళనాట కూడా విజయ్ కి విజయాన్ని అందించాలని అతని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. మరి, ఫ్యాన్ మాటను విజయ్ వింటారో లేదో చూడాలి.