English | Telugu

కేటీఆర్ పేరు చెబితేనే వణుకుతున్న టీఆర్ఎస్ సీనియర్లు.!

గులాబీ వనంలో సీనియర్లకు టెన్షన్ మొదలైంది. ఎప్పుడు ఏం జరుగుతుందోనని ఉలిక్కిపడుతున్నారు. తమ ఫ్యూచరేంటని కంగారు పడుతున్నారు. ఇంతకీ ఈ సీనియర్ల కంగారుకు కేటీఆరే కారణమట. పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ కేటీఆర్ ప్రాధాన్యత అమాంతం పెరిగిపోవడం... మరోవైపు త్వరలోనే ముఖ్యమంత్రి కాబోతున్నారన్న ప్రచారంతో నేతలంతా చిన్న బాస్ చుట్టూనే తిరుగుతున్నారు. అంతేకాదు, ఇటు పార్టీలోనూ, అటు ప్రభుత్వంలోనూ కేటీఆర్ హవానే కొనసాగుతుండటంతో సీనియర్లలో ఆందోళన మొదలైందట. ఇటీవల జరిగిన చీఫ్ సెక్రటరీ నియామకం దగ్గర్నుంచి... ఐఏఎస్ ల బదిలీల వరకు కేటీఆర్ మార్క్ కనపడిందని, అదే, ఇప్పుడు టీఆర్ఎస్ సీనియర్ల గుబులు కారణమంటున్నారు. యువ ఐఏఎస్ లకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడంతో... పార్టీలో సీనియర్లకు భవిష్యత్ పై బెంగ పట్టుకుంది. ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల తర్వాత పలువురు సీనియర్ నేతలు సైలెంట్ అయిపోయారు. మరికొందరు పార్టీ కార్యక్రమాల్లో పెద్దగా కనిపించటం లేదు. ఇంకొందరైతే అసలు కనపడటమే మానేశారు. మరోవైపు ఓటమిపాలైన సీనియర్ల నియోజకవర్గాల్లో... ఇతర పార్టీల ఎమ్మెల్యేలు, టీఆర్ఎస్ లో చేరటంతో రాజకీయంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎమ్మెల్యేలకు పార్టీ పుల్ పవర్స్ ఇవ్వటంతో నియోజకవర్గాల్లో ఈ నేతలు పూర్తిగా సైలెంట్ కావాల్సిన పరిస్థితులు ఏర్పడ్డయనే చర్చ జోరుగా సాగుతోంది.

టీఆర్ఎస్ లో మొదట్నుంచీ కేసీఆర్ కు వెన్నంటి ఉన్న మధుసూదనాచారికి రాష్ట్ర ఆవిర్భావం తర్వాత, తొలి తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గా అవకాశం దక్కింది. నాలుగున్నరేళ్లపాటు స్పీకర్ గా పనిచేసిన మధుసూధనాచారి 2018 ఎన్నికల్లో, ఓటమిపాలు కావడం ఆయనకు శాపంగా మారింది. ఆ తర్వాత ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి మండలి చైర్మన్ చేస్తారని ప్రచారం జరిగినా, అది కార్యరూపం దాల్చలేదు. ఇక దీనికి తోడు భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి టీఆర్ఎస్ లో చేరటంతో మధుసూదనాచారి పూర్తిగా సైలెంట్ అయిపోయారు. ఇక రాజకీయంగా ఆయన భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారిందనే చర్చ టీఆర్ఎస్ లోనే జరుగుతోంది. ఇక, మరో సీనియర్ నేత నాయిని నర్సింహారెడ్డికి పార్టీలో ప్రాధాన్యత తగ్గిపోయిందనే చర్చ జరుగుతోంది. నర్సన్న అని కేసీఆర్ ఆప్యాయంగా పిలిచే నాయిని ఎమ్మెల్సీ పదవి కాలం త్వరలోనే ముగియబోతోంది. అయితే ఆయనను మళ్లీ రెన్యువల్ చేయరనే చర్చ పార్టీలో జోరుగా సాగుతోంది. ఇక మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నా... ఆ తర్వాత మాత్రం ఆయన జిల్లాకే పరిమితమయ్యారు. ఇక, తెలంగాణ భవన్‌లో జరిగే సమావేశాలకు ఎమ్మెల్యేలకు మాత్రమే ప్రాధాన్యత ఇవ్వటంతో తుమ్మల ఇటువైపు రావటం మానేశారు. మరో మాజీ మంత్రి జూపల్లి కష్ణారావు ఇటీవల మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ అధిష్టానాన్ని ధిక్కరించి తన అనుచరులను బరిలో నిలబడటం ఆయనకు మైనస్ గా మారింది. పార్టీలో తాను కొనసాగుతానని ప్రెస్ మీట్ పెట్టీ మరి చెప్పినా...ఆయన పట్ల పార్టీ హైకమాండ్ ఆగ్రహంగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఇక మండలి చైర్మన్‌గా పనిచేసిన స్వామిగౌడ్ తన పదవీకాలం ముగిసిన తర్వాత ఆయనకు...పార్టీకి మధ్య గ్యాప్ బాగానే పెరిగిందనే గుసగుసలు పార్టీలో వినిపిస్తున్నాయి. మళ్లీ ఎమ్మెల్సీ పదవి ఇస్తారని ఆయన భావించినా, ఇప్పుడు అపాయింట్ మెంట్ కూడా దొరకటం లేదన్న చర్చ సొంత పార్టీలోనే జరుగుతోంది. మరో నేత, మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి కూడా టీఆర్ఎస్‌లో చేరేటప్పుడు ఏదో ఒక పదవి ఆశించే చేరారు. కానీ ఇప్పటివరకు ఆయనకు ఎలాంటి పదవీ దక్కకపోవడంతో, ఆయనా మౌనంగానే వున్నారు. ఓవైపు పార్టీ పూర్తిగా కేటీఆర్ కంట్రోల్ లోకి రావటంతో, టీఆర్ఎస్ లో చాలామంది సీనియర్ నేతలకు భవిష్యత్ లో పదవులు దక్కటం కష్టమేననన్న చర్చ కూడా జరుగుతోంది.

ఇప్పటికే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముద్ర అటు పార్టీపై...ఇటు ప్రభుత్వంపై కనిపిస్తోంది. పార్టీ పదవుల్లో...ఎమ్మెల్సీల ఎంపిక విషయంలోనూ కేటీఆర్ మార్క్ స్పష్టం. ఎమ్మెల్సీలు శంభిపూర్ రాజు, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, నవీన్ కుమార్ లాంటి యువ నేతలకు ఎమ్మెల్సీలుగా అవకాశం రావడంతో పార్టీలో యువ తారక మంత్రం పనిచేస్తోందన్న వాదనా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో రాబోయే రోజుల్లో పార్టీలో కూడా యువతరానికి పెద్దపీట వేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. దాంతో సీనియర్లకు పార్టీలో ప్రాధాన్యత తగ్గినట్లేనన్న చర్చ రాజకీయ వర్గాల్లోనూ జరుగుతోంది.