English | Telugu

జూలై 21 నుంచి అమర్‌నాథ్ యాత్ర

అమర్‌నాథ్ యాత్ర జూలై 21 నుంచి ప్రారంభం కానుందని జమ్మూ కశ్మీర్ ప్రభుత్వం వెల్లడించింది. అయితే, 45 రోజుల యాత్రను 15 రోజులకు కుదించింది. జూన్ 21 నుంచి ఆగస్టు 3 వరకు కేవలం 15 రోజులు మాత్రమే యాత్ర కొనసాగనుంది. వాస్తవానికి ఈ యాత్ర షెడ్యూల్‌ను జూన్ 23 నుంచి ఆగస్టు 3 వరకూ కొనసాగించాలని తొలుత నిర్ణయించారు. అయితే, కరోనా వైరస్ కారణంగా తేదీలను మార్చి.. జులై 21కు వాయిదా వేశారు. జమ్మూ కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ గిరీష్ చంద్ర ముర్ము అధ్యక్షతన జరిగిన శ్రీ అమర్ నాథ్ జీ పుణ్య క్షేత్రం బోర్డు సమావేశంలో ఈ షెడ్యూల్ ఖరారు చేశారు. యాత్రకు సంబంధించి రిజిస్ట్రేషన్ ప్రక్రియ త్వరలోనే ప్రారంభించనున్నారు. భక్తులు ఆన్‌లైన్‌లోనే రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని, సాధు సంతువులకు మాత్రం ఈ నిబంధన వర్తించదని అధికారులు తెలిపారు.

తాజా మార్గదర్శకాల ప్రకారం 55 ఏళ్లు దాటినవారికి యాత్రకు అనుమతి లేదు. యాత్రకు వచ్చే భక్తులు తప్పనిసరిగా కరోనా పరీక్షలు చేయించుకోవాలి. కోవిడ్ సోకలేదని, కోవిడ్ నెగెటివ్ సర్టిఫికెట్లను.. యాత్రకు వెళ్లడానికి ముందే అధికారులకు అందజేయాల్సి ఉంటుంది.