English | Telugu

లాక్‌డౌన్-4 వుంటుందా? మ‌ళ్లీ సీఎంలతో ప్ర‌ధాని కాన్ఫరెన్స్‌!

కరోనా నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్‌-3 కొనసాగుతున్న తరుణంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సీఎంలతో ఐదోసారి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. లాక్‌డౌన్ అమలుపై చర్చిస్తారు. కరోనా కట్టడికి తీసుకుంటున్న చర్యలపై సమీక్ష జరుపుతారు. ఈ నెల 17న లాక్‌డౌన్-3 ముగియనున్న తరుణంలో మోదీ సీఎంలతో జరిపే వీడియో కాన్ఫరెన్స్‌కు ప్రాధాన్యత ఏర్పడింది.

సోమవారం మధ్యాహ్నాం 3 గంటలకు ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మోదీ సీఎంలతో మాట్లాడనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధానితో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, వైద్య శాఖ మంత్రి, వైద్య శాఖ కార్యదర్శి, హోం మంత్రి హోంశాఖ కార్యదర్శి కూడా హాజరుకానున్నారు. రాష్ట్రాల వారిగా కోవిడ్‌ నివారణకు చేపడుతున్న చర్యలను మోదీ తెలుసుకోనున్నారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం పలు సూచనలు, సలహాలు కూడా మోదీ ఇవ్వనున్నారు.

కేంద్ర ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్‌ ఈ నెల 17తో ముగియనున్న నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. అలాగే లాక్‌డౌన్‌ కారణంగా ఆర్థిక వనరులు పూర్తిగా మూసుకుపోవడంతో ప్రత్యక ప్యాకేజీ ప్రకటించాలని వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేంద్రాన్ని కోరుతున్న విషయం తెలిసింది. దీనిపై కేంద్ర ప్రభుత్వం ఏవిధంగా స్పందిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.