ఉద్యానవన రైతులను ఆదుకునేందుకు తెలంగాణ రాష్ట్ర మార్కెటింగ్ శాఖ వినూత్న కార్యక్రమం అమలు చేస్తోంది. జంటనగరాల్లో ప్రజల ఇంటి వద్దకే పండ్ల సరఫరా కార్యక్రమాన్ని ప్రారంభించింది. కాలనీలు, అపార్ట్మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీల్లోని ప్రజలు 30 ప్యాక్లు ఆర్డర్ ఇస్తే నేరుగా సరఫరా చేస్తామని ప్రకటించింది. 73307 33212కు ఫోన్ చేస్తే డోర్ డెలివరీ అందిస్తారని మార్కెటింగ్ శాఖ అధికారులు చెబుతున్నారు. ప్యాక్ లో ఉండే పండ్ల రకాల్ని చూస్తే.. మామిడికాయలు 3.5కేజీలు.. బొప్పాయి 3 కేజీలు.. సపోటా కేజీ..బత్తాయి 2.5కేజీలు.. నిమ్మకాయలు 12.. పుచ్చకాయలు నాలుగు కేజీలు ఉంటాయి. అంటే..మొత్తం 22 కేజీల పండ్లు రూ.300లకే ఇంటికి తెచ్చేలా మార్కెటింగ్ శాఖ ప్లాన్ చేసింది.
లాక్ డౌన్ నేపథ్యంలో ఉత్తరాదికి పండ్ల ఎగుమతులు నిలిచిపోయాయి. స్థానికంగా అమ్ముకునేందుకు రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ నిర్ణయం రైతులకు ఆదాయాన్ని, ప్రజలకు ఇంటివద్దనే తాజా పండ్లను అందిస్తుందని వ్యవసాయ శాఖ డైరెక్టర్ లక్ష్మీబాయి తెలిపారు.