English | Telugu

తిరుమలలో దర్శనాలు రద్దు! స్వామి వారి కైంకర్యాలు మాత్రం యథాతథం

తిరుమలలో భక్తుల దర్శనాన్ని తాత్కాలికంగా నిలిపివేశారు. తిరుమల చరిత్రలో ఇలాంటి కీలక నిర్ణయం తీసుకోవడం 128 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి. 1892లో రెండు రోజుల పాటు కేవలం భక్తులకు దర్శనాన్ని మాత్రమే కాదు. ఏకంగా ఆలయాన్ని కూడా మూసివేసినట్టు రికార్డుల్లో నమోదయ్యిందని టీటీడీ ఈవో అనిల్ సింఘాల్ తెలిపారు. అయితే స్వామి వారి కైంకర్యాలు మాత్రం యథాతథంగా కొనసాగుతాయి. ఇప్పటి వరకు ఉన్న ఆదేశాల మేరకు ఈ నిర్ణయాలు తీసుకున్నామని.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయం మేరకు తదపరి ఆదేశాలు ఉంటాయని టీటీడీ తెలిపింది.

గతంలో ఎన్నడూ లేని రీతిలో తొలిసారిగా వైరస్ వ్యాప్తి కారణంగా యాత్రికులను తిరుమలకు రావద్దని చెప్పడం ఇదే తొలిసారి. రెండేళ్ల క్రితం సంప్రోక్షణ పేరుతో బాలాలయం కోసం 9 రోజుల పాటు దర్శనాలు నిలిపివేశారు. బంద్ , ఇతర ఆందోళనల కారణంగా కొన్ని రోజుల పాటు భక్తుల రాకపోకలకు ఆటంకాలు ఏర్పడిన అనుభవాలున్నాయి. సమైక్యాంధ్ర ఉద్యమం సమయంలో కొంతకాలం అలాంటి పరిస్థితి ఏర్పడింది.

అయితే తొలిసారిగా టీటీడీ అధికారులే భక్తులు రావద్దని చెప్పడం ఇప్పుడే జ‌రిగింది. గతంలో ఎన్నడూ ఇలా జరగలేదు. ఇప్పుడు కూడా ఎన్ని రోజుల పాటు ఆలయంలో దర్శనాలు నిలిపివేస్తున్నారన్నది స్పష్టత లేదు.